రాష్ట్రపతి భవన్లో శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు
భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు/సంస్థలకు చెందిన పిల్లలు రాష్ట్రపతి భవన్లో దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు

- దేశాధ్యక్షురాలితో కలిసి చిల్డ్రన్స్ డే వేడుకలు
- పుస్తకాలే నిజమైన స్నేహితులన్న ముర్ము
విధాత: భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు/సంస్థలకు చెందిన పిల్లలు రాష్ట్రపతి భవన్లో దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (RBCC)లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు నుంచి శ్రీ విజ్ఞాన్ సీబీఎస్ ఈ పాఠశాల విద్యార్థులు హాజరైనారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తు అని మనం తరచుగా చెబుతుంటాం. ఈ భవిష్యత్తును కాపాడుకోవడం, వారి సరైన ఎదుగుదలని నిర్ధారించడం మనందరి కర్తవ్యం అన్నారు. నేటి చిన్నారులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఎంతో సమాచారం, విజ్ఞానం అందుబాటులో ఉన్నాయని ముర్ము పేర్కొన్నారు. భారతదేశ పిల్లలు దేశ విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని, మన పిల్లల ప్రతిభకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.
పిల్లలకు సున్నితత్వం ఎక్కువగా ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖపడతారు, ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషిస్తారని చెప్పారు. పిల్లల్లో ఉండే ఈ గుణం కారణంగా, మనం ఇతరులకు సహాయం చేయడానికి, పర్యావరణం పట్ల ప్రేమ, గౌరవాన్ని కలిగి ఉండటానికి బాల్యం నుండి వారిని ప్రేరేపించగలగాలన్నారు. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు.
పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించి, పూర్తి అంకితభావంతో, కష్టపడి తమ లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటే, వారు ఖచ్చితంగా తమ లక్ష్యాన్ని చేరుకోగలరని రాష్ట్రపతి పిల్లలకు చెప్పారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఆమె వారికి సూచించారు. పుస్తకాలు మంచి స్నేహితులు అని అన్నారు. మంచి పుస్తకాలు వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తెస్తాయని ఆమె పేర్కొన్నారు.
గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ఆమె పిల్లలకు సూచించారు, పిల్లల్లో స్ఫూర్తితోపాటు, సవాళ్లను ఎదుర్కోవడంలో పుస్తకపఠనం వారికి సహాయపడుతుందని చెప్పారు. ఈ వేడుకలకు శ్రీవిజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ కట్టుబడి మస్తాన్, ఉపాధ్యాయులు షమీ, ఫరియాజ్బేగంతో పాటు విద్యార్థులు రొద్దం సాహితీప్రియ, కె.షోయబ్, నవీద్, దివ్య తదితరులు పాల్గొన్నారు.
