విధాత,హైదరాబాద్‌:నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’. సెప్టెంబరు 5వ తేదీ నుంచి మొదలైంది. నాగ్‌ అదిరే గ్రాండ్‌ ఎంట్రీతో షో మొదలైంది. తొలుత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నాగార్జున అక్కడ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ తర్వాత ‘సీజన్‌-5’లో పాల్గొనే కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోపలికి వెళ్లారు. సిరి హనుమంత్‌ మొదటి కంటెస్టెంట్‌ కాగా యాంకర్‌ రవి చివరిగా వెళ్లారు. ఈ సందర్భంగా ‘సింగిల్‌ బెడ్‌’ కోసం నాలుగు విడతల్లో […]

విధాత,హైదరాబాద్‌:నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’. సెప్టెంబరు 5వ తేదీ నుంచి మొదలైంది. నాగ్‌ అదిరే గ్రాండ్‌ ఎంట్రీతో షో మొదలైంది. తొలుత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నాగార్జున అక్కడ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ తర్వాత ‘సీజన్‌-5’లో పాల్గొనే కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోపలికి వెళ్లారు. సిరి హనుమంత్‌ మొదటి కంటెస్టెంట్‌ కాగా యాంకర్‌ రవి చివరిగా వెళ్లారు. ఈ సందర్భంగా ‘సింగిల్‌ బెడ్‌’ కోసం నాలుగు విడతల్లో జరిగిన టాస్క్‌ల్లో విజయ్‌ సన్నీ, ప్రియాంక సింగ్‌, విశ్వ, మానస్‌లు విజయం సాధించారు. చివరిగా నిర్వహించిన టాస్క్‌లో సింగిల్‌ బెడ్‌ను విశ్వ సొంతం చేసుకున్నాడు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎవరెవరు వెళ్లారు? వెళ్లేటప్పుడు ఎవరెవరు ఏం చెప్పారంటే?
సిరి హనుమంత్
తొలి కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ సిరి హనుమంత్‌ ఎంట్రీ ఇచ్చింది. ‘బిగ్‌బాస్‌ ఫ్లాట్‌ఫాం అంటే నాకు ఇష్టం. ఇది నా అదృష్టం. మొదటి నుంచి దీన్ని ఫాలో అవుతున్నా. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో దాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ సిరి హౌస్‌లోకి అడుగు పెట్టింది.
విజయ్ సన్నీ
రెండో కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటుడు విజయ్‌ సన్నీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు నాగార్జున ఆయనతో ఓ అమ్మాయి బొమ్మ గీయించారు. ఈ షో అయిపోయేలోపు బొమ్మలాంటి అమ్మాయిని కనిపెట్టాలని షరతు పెట్టారు.
లహారి షేహరి
‘బ్లాంక్‌ మైండ్‌తో వచ్చాను. బయట ఎలా ఉంటానో లోపల కూడా అలాగే ఉంటాను’ అంటూ ఎంట్రీ ఇచ్చింది నటి లహరి షెహరి. నాగార్జునకు అరుదైన గులాబీని ఇచ్చి హౌస్‌లోకి వెళ్లింది.
శ్రీరామ చంద్ర
టీవీలో బిగ్‌బాస్‌ మ్యూజిక్‌ విన్నప్పుడల్లా తనని పిలుస్తున్నట్లు అనిపించేదని, ఇంతకాలానికి తాను ఈ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నానని ఆనందం వ్యక్తం చేశారు గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌(సీజన్‌-5) విజేత శ్రీరామ చంద్ర. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తన పాటలతో ముఖ్యంగా తెలుగు పాటలతో అక్కడి వారిని, ప్రేక్షకులను నాగార్జునను కూడా మెప్పిస్తానని అన్నారు. బిగ్‌బాస్‌-5తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని చెప్పుకొచ్చారు.
యానీ మాస్టర్
‘ఇప్పటివరకూ తెలుగు బిగ్‌బాస్‌లో అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఈసారి తప్పకుండా అమ్మాయి గెలుస్తుంది’ అంటూ ధీమా వ్యక్తం చేశారు యానీ మాస్టర్‌. డ్యాన్స్‌ మాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. ఈ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తే, తన కుమారుడిని బాగా మిస్సవుతానని భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యామిలీ కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధమని అన్నారు.

దుకాణంలో పనిచేయడంతో తన జీవిత మొదలైందని మహ్మద్‌ ఖయ్యూం అలియాస్‌ లోబో అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆయన ఓ కజికిస్థాన్‌ అమ్మాయికి టాటూ వేస్తే, ఆ అమ్మాయే లోబో అని పేరు పెట్టిందని వివరించారు. తన భార్య రాకతో జీవితం మారిపోయిందని చెప్పారు. మొదటి నుంచి తనకు వెరైటీగా ఉండటం ఇష్టమని, అందుకే అందరిలోకన్నా భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తన కెరీర్‌కు ‘బిగ్‌బాస్‌’ మంచి వేదిక అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

‘బిగ్‌బాస్‌’ నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌లాంటిదని, నటి ప్రియ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ముందు మాట్లాడిన ఆమె.. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నానంటే అది తన అదృష్టమని, దేవుడి దయ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. తన బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకునేందుకు ఈ షోకు వచ్చినట్లు చెప్పిన ప్రియ, జీవితం తనకు ఒంటరిగా బతికే అవకాశం ఇస్తే, ఎలా ఉంటుందో ఈ షో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.

36 గంటల పాటు ఏకధాటిగా మోడలింగ్‌ చేసి, రికార్డు సృష్టించిన సూపర్‌ మోడల్‌, ట్రైనర్‌ జెస్సీ ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మోడలింగ్‌ ఎలా చేస్తారో ఈ సందర్భంగా వివరించారు. ‘బయటకు వచ్చే సరికి అందరికీ మోడలింగ్‌ నేర్పి, వాక్‌ చేయిస్తావేమో’ అంటూ నాగార్జున సరదాగా వ్యాఖ్యానించగా, చిరునవ్వులు చిందిస్తూ జెస్సీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

ట్రాన్స్‌ జెండర్‌, నటి ప్రియాంక సింగ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారడం వెనుక జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తనకు 25ఏళ్లు వచ్చే సరికి ఇంట్లో పెళ్లి చేద్దామనుకున్నారని, వచ్చే అమ్మాయి జీవితం నాశనం అవకూడదనే ఉద్దేశంతోనే తన ఇష్టానికి అనుగుణంగా అమ్మాయిగా మారినట్లు వివరించారు. ఈ విషయం ఇప్పటివరకూ తన తండ్రికి కూడా తెలియదని, ఈ వేదిక నుంచే ఆ విషయాన్ని ఆయనకు చెబుతున్నానని అన్నారు. సహృదయంతో తన తండ్రి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనని ఇంట్లో తేజ అని పిలుస్తారని, ఎప్పటికీ తన తండ్రికి అండగా ఉంటానని ప్రియాంక చెప్పుకొచ్చారు.

తాను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం తన తల్లికి తెలుసని, ఆమె సపోర్ట్‌ తనకు ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

కవర్‌సాంగ్స్‌తో తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ తెలిపాడు. పదో కంటెస్టెంట్‌గా అతడు హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అంతకు ముందు నాగార్జునతో మాట్లాడుతూ.. వెబ్‌సిరీస్‌లు తనకు మంచి పేరు తీసుకువచ్చినట్లు వివరించాడు. కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ తాను పశ్చాత్తాపపడుతున్నానని అన్నాడు. ఈ షో కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కాలేదని, సరికొత్తగా కెరీర్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు. మరి నీలో ఉన్న ఆ ఆరు రూపాలు హౌస్‌లో చూపిస్తావా’ అని నాగార్జున అడగ్గా, తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు.

‘సాహసం సేయరా ఢింభకా’ ఫేమ్‌ కథానాయిక హమీదా 11వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. తాను మృదు స్వభావినని, సాయం చేసే తత్వం ఉందని చెప్పారు. అబ్బాయిల్లో కళ్లు, స్మైల్‌, హెయిర్‌ స్టైల్‌ అంటే ఇష్టమని చెప్పగా, నాగార్జున ‘బిగ్‌బాస్‌’లోని ఐదుగురు కంటెస్టెంట్‌ల కళ్లు మాత్రమే చూపించి, వాళ్లని కనిపెట్టాలని సూచించారు.

హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, డ్యాన్స్‌ మాస్టర్‌ అయినట్లు నటరాజ్‌ మాస్టర్‌ అన్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో 12వ కంటెస్టెంట్‌గా ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన ప్రేమకథను వేదికపై వివరించారు. తనకు అమ్మైనా, నాన్న అయినా తన భార్యేనని అన్నారు. తన భార్య ఏడు నెలల గర్భణి అని ఆమె ధైర్యం చెప్పడం వల్లే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తున్నానని నటరాజ్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన తన భార్యను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఏదో ఒకటి సాధించే హౌస్‌ నుంచి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

‘‘చిన్నప్పుడు మా అమ్మతో కలిసి ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్లేదాన్ని. అప్పుడు అమ్మ ‘అదిగో అది అన్నపూర్ణా స్టూడియోస్‌. నాగేశ్వరరావుగారిది. అందులో సినిమా షూటింగ్‌లు జరుగుతాయి’ అని చెప్పింది. ‘అమ్మా మనం కూడా లోపలకు వెళ్దాం’ అని అంటే ‘లేదమ్మా.. కేవలం సినిమాల్లో నటించే వాళ్లనే లోపలకు పంపుతారు’ అని చెప్పింది. ‘ఎప్పటికైనా అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లాలి’ అని నా మనసులో అప్పుడే అనుకున్నా. ఇన్నాళ్లకు, అది కూడా ‘బిగ్‌బాస్‌’ షోతో ఓ కోరిక నెరవేరింది’’ అంటూ చెప్పుకొచ్చారు ‘సెవెన్‌ ఆర్ట్స్‌’ సరయు 13వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టారామె. ఈ సందర్భంగా నాగార్జున అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి నవ్వులు పంచారు. బిగ్‌బాస్‌నే కాదు, ఎవరినైనా ధమ్‌ధమ్‌ చేస్తానంటూ చిరు నవ్వులు చిందించారు.
‘బిగ్‌బాస్‌-5’ తనకెంతో కనెక్ట్‌ అయి ఉందని నటుడు, బాడీ బిల్డర్‌, డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్‌ విశ్వ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన అతడు, నాగార్జున నిర్మించిన ‘యువ’ సీరియల్‌తోనే నటుడిగా పరిచయం అయినట్లు తెలిపారు. నాగచైతన్య కూడా కలిసి నటించడం, అఖిల్‌తో కలిసి క్రికెట్‌ ఆడటం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైల్‌ అవుట్‌ జరిగితే అందులో ఫైనలిస్ట్‌గా ఎంపికైనట్లు తెలిపారు. విశ్వ కండలు చూసిన నాగార్జున ఒక చిన్న రిక్వెస్ట్‌ చేశారు. హౌస్‌లో టాస్క్‌లు ఆడేటప్పుడు కంటెస్టెంట్‌లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దీంతో విశ్వ చిరునవ్వులు చిందించాడు.
తన వ్యక్తిగత, వృతి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని నటి ఉమ అన్నారు. సినిమాలతో పాటు, సీరియల్స్‌ ద్వారా మంచి పేరుతెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్‌హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఉమాదేవి మనసులో ఏమనుకుంటుందో అదే మాట్లాడుతుందని, దాన్నే ‘బిగ్‌బాస్‌’ ద్వారా ప్రజలకు చూపించబోతున్నానని అన్నారు.


‘కాయ్‌ రాజా కాయ్‌’, ‘గ్యాంగ్‌ ఆఫ్ గబ్బర్‌సింగ్‌’ ‘గోలీసోడ’ చిత్రాలతో నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన మానస్‌ 16వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటి నుంచి తన తల్లిని వదిలి ఎప్పుడూ లేనని, అయితే తనకు ఛాలెంజెస్‌ అంటే ఇష్టమని అందుకే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. హౌస్‌లో ఎప్పటికీ హీరోలా ఉండటానికే ప్రయత్నిస్తానని మానస్‌ అన్నాడు.


‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి రావడం నమ్మలేకపోతున్నానని ఆర్జే కాజల్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె నాగార్జునను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. హౌస్‌ నుంచి బయటకు వెళ్లేలోపు ప్రేక్షకులు, హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జునతో కూడా ‘ఐ లవ్‌ యూ’ చెప్పించుకోవాలన్నదే తన కోరిక అని అనగా, నాగార్జున అక్కడే ‘ఐ లవ్‌ యూ’ చెప్పి బాగా ఆడాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గాయని జానకిలా పాట పాడి కాజల్‌ అలరించారు.

‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ది రోజ్‌ విల్లా’ చిత్రాల్లో నటించిన శ్వేత వర్మ బిగ్‌బాస్‌-5లోకి 18వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. సీజన్‌-5ను చించి పడేస్తానని శ్వేత వర్మ ధీమా వ్యక్తం చేసింది. తనలో ఉన్న ఐదు రూపాలను హౌస్‌లో చూపిస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
యాంకర్‌, నటుడు రవి బిగ్‌బాస్‌-5లో అడుగు పెట్టాడు. ఇప్పటివరకూ తనని యాంకర్‌ రవిగా అంతా చూశారని, ఇక నుంచి రియల్‌ రవి కిరణ్‌ను చూడబోతున్నారని అన్నాడు. ఎంత రియల్‌గా ఉన్నా ఎవరూ నమ్మటం లేదని, ఈసారి ఆ నమ్మకాన్ని అందరిలోనూ కలిగిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రవి కుమార్తె మాటలను వినిపించి నాగార్జున సర్‌ప్రైజ్‌ చేశారు.

Updated On 6 Sep 2021 11:05 AM GMT
Venkat

Venkat

Next Story