JEWELS OF ASAF JAHI’S.. కాఫీ బుక్‌ను ఆవిష్కరించిన సీఎస్

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన ‘JEWELS OF ASAF JAHI'S-the Glory of WARANGAL’ అనే కాఫీ టేబుల్ బుక్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు.

విధాత, హైదరాబాద్ :
సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన ‘JEWELS OF ASAF JAHI’S-the Glory of WARANGAL’ అనే కాఫీ టేబుల్ బుక్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక కూడా హాజరయ్యారు.

వరంగల్ నగరంలో అసఫ్‌జాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్ కేంద్రంగా పాలించిన సుబేదారుల వివరాలు వారి చరిత్రతో కూడిన ఈ కాఫి టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడుతుందని సీఎస్ అన్నారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్ బుక్ ను వెలువరించడం అభినందనీయమని సీఎస్ రామకృష్ణ రావు ప్రశంసించారు.

వరంగల్ అంటే.. కాకతీయుల పాలన, వేయి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం వెంటనే మదికి వస్తాయి. అయితే, వరంగల్ నగరంలో అడుగు పెట్టగానే కాజిపేట నుండి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుతమైన భవనాలు, కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పధకమైన ఇంటింటికి తాగునీరందించే ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు వరంగల్ కేంద్రంగా వరంగల్ సుబాహ్ గా ఆదిలాబాద్‌, కరీంనగర్, వరంగల్‌, ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి.

ఈ వరంగల్ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతో కూడిన సమాచారంతో పాటు నిజాం నిర్మిత హెరిటేజ్ కట్టడాల ఫోటోలతో కలిపి ఈ ‘JEWELS OF ASAF JAHI’S-the Glory of WARANGAL’ కాఫి టేబుల్ బుక్ ఉంటుంది. ఈ పుస్తకం చరిత్ర అధ్యయన వేత్తలు, విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుంది.