Karimnagar
విధాత: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకుండా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను అవమానించారంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26మంది ఎన్నికల కమిటీలో తనకు స్థానం దక్కని తీరుపై పొన్నం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
శనివారం పొన్నం నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఆయనను కలిసి తమ సంఘీభావం తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎన్నికల కమిటీలో అవకాశం కల్పించి, ఎన్ఎస్యుఐ నుండి కాంగ్రెస్ పటిష్టత కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్న పొన్నంను మాత్రం పక్కన పెట్టడం పట్ల వారంతా అసంతృప్తిని వ్యక్త్తం చేశారు.
హైకమాండ్ చర్య పొన్నంను అవమానించేదిగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి కాంగ్రెస్ ఇచ్చే మర్యాద ఇదేనా అంటు ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉన్నందునా నేరుగా గాంధీభవన్కు భారీ ర్యాలీగా వెళ్లి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసి పొన్నంకు జరిగిన అన్యాయంపై నిలదీయనున్నట్లుగా ప్రకటించారు. పార్టీ పెద్దలు దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.