Adilabad |
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జూన్ 4న నిర్మల్ , జూన్ 9న మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన కోసం భారీగా జన సమీకరణ కోసం నేతల కసరత్తు చేస్తున్నారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీ ఉన్నారు.
విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన రెండు దఫాలుగా కొనసాగనుంది. నిర్మల్ మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ క్యాడర్ను ప్రజలను సీఎం సభకు తరలించడానికి సన్నద్ధం చేస్తున్నారు. రెండు జిల్లాలలో ప్రధానంగా జిల్లా కలెక్టరేట్ నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ నెల 4న ఆదివారం రోజున నిర్మల్ జిల్లాలోని నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డిస్ట్రిబ్యూషన్లో పాల్గొని పట్టాల పంపిణీ చేస్తారు. అలాగే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం 50 కోట్లతో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ శివారులో నిర్మించిన నూతన సమీపృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈనెల 9న సీఎం ప్రారంభోత్సవం చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సీఎం సభ విజయ వంతం కోసం ప్రత్యేకంగా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు పార్టీ క్యాడర్తో సమీక్ష సమావేశాలు నిర్వహించి పనులను పురమాయించారు.
మంచిర్యాల జిల్లా ఐడీఓసీ నూతన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. సమీపంలో నిర్మించిన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1658 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు, మందమర్రి మండలంలో సుమారు Rs 500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంచిర్యాల ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నమంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తారు. మంచిర్యాల సభ వేదికగా రెండో విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఇడ్ల పట్టాల పంపిణీ పథకాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం తరువాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.