Suryapet
విధాత: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోడీ సొంత రాష్ట్రం 25 సంవత్సరాలుగా బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్ రాష్ట్రం అభివృద్దితో పోల్చి చూద్దామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి గుజరాత్లో ఒరగపెట్టింది ఏమి లేదని ఆయన దుయ్యబట్టారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియా తో మాట్లాడారు. ఉద్యోగాల కల్పన పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం బిజెపి పాలిత రాష్ట్రాలలో కలిపి కూడా గడిచిన తొమ్మిది ఏళ్లలో తెలంగాణలో ఇచ్చిన అన్ని ఉద్యోగాలు కల్పించ లేకపోయారని ఆయన స్పష్టం చేశారు. సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు.
కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయం ఉన్న చోట ఇతర పార్టీలే విజయం సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఉనికి కోసమే బిజెపి పడరానిపాట్లు పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికతనే కిషన్ రెడ్డికి లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే మీమీద విశ్వసనీయత పెరుగుతుందని, ఇప్పటి వరకైతే క్షేత్ర స్థాయిలో అటువంటిది ఏమి కనపడడం లేదన్నారు.
బిజెపి కుట్రలు తెలంగాణలో పని చెయ్యవని, యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని ఆయన తెలిపారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారాని, 2014, 2018 ఎన్నికల్లో అదే జరిగిందని, 2023 ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హెచ్చరించారు.