విధాత, అమరావతి: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించిన మేకపాటి విక్రమ్రెడ్డి, పార్టీ నేతలను సీఎం వైయస్ జగన్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వైయస్ఆర్ సీపీ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా విక్రమ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందని.. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు.
నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతిపై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జూలైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి తెలిపారు.