- నేడు లక్నోలో కివీస్ తో రెండో టి20
- సిరీస్ లో నిలువాలంటే గెలవాల్సిందే..
- మరో హోరాహోరీ మ్యాచ్ లో తలపడుతున్న టీమ్ ఇండియా
- రా.గం.7 నుంచి స్టార్స్పోర్ట్స్–1లో
విధాత, లక్నో: సిరీస్ లో నిలువాలంటే గెలిచి తీరాల్సిందే. ఇదీ ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమ్ ఇండియా పరిస్థితి. వన్డేల్లో క్లీన్ సీప్ కు గురైన కివీస్ జట్టు టీ20సిరీస్ లో మాత్రం అదరగొడుతోంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్ లో విజయంతో కివీస్ జట్టు టీమ్ ఇండియాకు షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రెజర్ అంతా టీమ్ ఇండియా పైనే.. టాపార్డర్ వైఫల్యం..బౌలింగ్ లో బలహీనతలు సరిచేసుకోకపోతే లక్నోలో జరిగే మ్యాచ్ తో పాటు సిరీస్ కోల్పోవాల్సిందే.
సీనియర్లు రోహిత్, కోహ్లి, రాహుల్ లకు టీ20ల నుంచి రెస్ట్ ఇవ్వడంతో అవకాశాలు దక్కించుకున్న యంగ్ ప్లేయర్లు సోసోగా ఆడుతున్నారు. బంగ్లాదేశ్ తో డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్..న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న శుబ్ మన్ గిల్.. టీ20ల్లో తుస్సుమనిపిస్తున్నారు. న్యూజిలాండ్ తో వన్డేల్లో వరుసగా 5, 8, 17 పరుగులే చేసిన కిషాన్ తొలి టీ20లో 4 పరుగులకే ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ సైతం వన్డేల్లో మాదిరి టీ20ల్లో రాణించలేకపోతున్నాడు.
రెండో టీ20లో వీరిద్దరూ దూకుడు చూపించాల్సిందే. ఓపెనింగ్ లో వీరు రాణిస్తే కెప్టెన్ హార్దిక్.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ పై ఒత్తిడి తగ్గుతుంది. కాగా, ఇటీవల చెప్పుకోతగిన ఇన్నింగ్స్ ఆడడంలో దీపక్ హుడా.. అవకాశం దక్కినా యుటిలైజ్ చేసుకోవడంలో రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా అవకాశాలు దొరుకుతున్నా.. టీమ్ మేనేజ్ మెంట్ ప్రోత్సహిస్తున్నా దీపక్ హుడా రాణించలేకపోవడం ఆశ్చర్యమే.
బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ లయను అందుకోలేక పోవడం ఆందోళన కరంగా ఉంది. స్పీడున్నా వైవిధ్యం లేకపోవడంతో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్న ఉమ్రాన్ మాలిక్.. దీంతో పేస్ బౌలింగ్ లో పసలేకుండా పాయింది. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ ..కుల్దీప్ యాదవ్ రాణించడం జట్టుకు కాస్త రిలీఫ్.. లక్నో లోనూ వీరిద్దరు రాణిస్తే భారత్ కు విజయం నల్లేరుపై నడకే.. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్ లో ఆల్ రౌండర్ గా సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్.. బ్యాటింగ్ లో రాణించిన సూర్యపైనే భారత్ ఆశలు కాగా.. ఈ మ్యాచ్ లో జట్టు సమష్టిగా రాణించకపోతే కివీస్ సిరీస్ ఎగరేసుకుపోవడం ఖాయమే..ఫస్ట్ మ్యాచ్లో ఓడినా నేడు తుది జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు.
న్యూజిలాండ్ అదుర్స్
వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ ను మరిపిస్తూ కివీస్ జట్టు తొలి టీ20లో చేలరేగింది. ఓపెనర్లు కాన్వే, అలెన్లతో పాటు ఆల్రౌండర్ మిచెల్ బ్యాటింగ్లో అదరగొట్టగా.. బౌలింగ్ లోనూ సాంట్నర్ నాయకత్వంలోని కివీలు సత్తా చాటారు. ఈమ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వేదిక ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ కు అనుకూలం. హార్డ్ హిట్టర్లు.. ఆల్ రౌండర్లతో నిండిన కివీలు స్థాయికి తగినట్లు రాణిస్తే సిరీస్ విజయం దక్కనుంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.
పిచ్–వాతావరణం
అటల్ బిహారీ వాజపేయి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలం. ఇక్కడ టీమ్ ఇండియా గతంలో రెండు మ్యాచ్ల్లో 190కి పైగా రన్స్ చేసి విజయం అందుకుంది. హిమాలయాల ప్రభావంతో రాత్రి మంచు ప్రభావం ఎక్కువ. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ కీలకం.
తుది జట్లు (అంచనా)
టీమ్ ఇండియా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, త్రిపాఠి, సూర్యకుమార్, సుందర్, దీపక్ హుడా, శివమ్ మావి, కుల్దీప్, అర్‡్షదీప్, ఉమ్రాన్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిచెల్, బ్రేస్వెల్, ఇష్సోధి, ఫెర్గూసన్, డఫీ, టిక్నర్.