తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ… ఏకంగా అచ్చెన్నాయుడు పైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్న దానిపై ఇప్పుడు టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. కేఎల్ నారాయణ అనే వ్యక్తితో నాలుగు వందల గజాల స్థలం విషయంలో తనకు వివాదం ఉందని.. మాట సాయం చేయమంటే చంద్రబాబు, లోకేష్ చేయడం లేదనేది ఆకుల వెంకటేష్ ప్రధాన ఆరోపణ. అందుకే తిరుపతికి వెళ్లి అచ్చెన్నాయుడుతో […]

తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ… ఏకంగా అచ్చెన్నాయుడు పైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్న దానిపై ఇప్పుడు టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. కేఎల్ నారాయణ అనే వ్యక్తితో నాలుగు వందల గజాల స్థలం విషయంలో తనకు వివాదం ఉందని.. మాట సాయం చేయమంటే చంద్రబాబు, లోకేష్ చేయడం లేదనేది ఆకుల వెంకటేష్ ప్రధాన ఆరోపణ. అందుకే తిరుపతికి వెళ్లి అచ్చెన్నాయుడుతో మాట్లాడానని… సభలో చొక్కా విప్పి విసిరేశానని.. వైసీపీకి ఏం సంబంధం లేదని… ఆయన అదే పనిగా ఓ వర్గం మీడియాకు చెప్పిందే చెబుతున్నారు.

స్థలం గొడవలో మాట సాయం చేయలేదని రచ్చ…!

ఆకుల వెంకటేష్ .. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ నేతగా చెలామణి అవుతూంటారు. టీడీపీ తెలంగాణలో బలంగా ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీ నేతగా …దందాలు చేయడానికి ప్రయత్నించేవారు. టీఆర్ఎస్‌లో చేరిన జూబ్లిహిల్స్ నేతకు అనుచరుడిగా వ్యవహరించేవారు. తెలంగాణలో టీడీపీ పతనావస్థకు చేరిన తర్వాత ఈ వెంకటేష్ ఎక్కడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పార్టీ కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు. అయితే జూబ్లిహిల్స్‌లోని ఓ స్థలం విషయంలో వివాదం ఉందని మాత్రం.. ఈయన చెబుతున్నారు. నాలుగు వందల గజాల ఆ స్థలం విలువ రూ. ఆరు కోట్లు ఉంటుందని.. రూ. రెండు కోట్లు ఇవ్వాలని అడుగుతున్నానని అంటున్నారు. ఆ స్థలం విషయంలో వివాదం ఎవరితో ఉందంటే.. కెఎల్ నారాయణతో అంటున్నారు. కేఎల్ నారాయణ ప్రముఖ సినీ నిర్మాత మాత్రమే కాదు.. హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒక దానికి యజమాని. ఆయన కంపెనీ టర్నోవర్ వందల కోట్లలోనే ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కన అనేక భారీ ప్రాజెక్టులు చేపట్టారు. అలాంటి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారితో తనకు నాలుగు వందల గజాల స్థలం వివాదం ఉందని.. దాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు మాట సాయం చేయాలని అడిగితే చేయలేదని వెంకటేష్ ఆరోపిస్తున్నారు.
పార్టీ కోసం ఖర్చు పెట్టిన స్థాయి నేత కాదు..!

ఆకుల వెంకటేష్ టీడీపీ తరపున ఏ స్థాయి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. పార్టీ కోసం 30 ఏళ్లుగా పని చేసి నష్టపోయానని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్న సందర్భమే లేదని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. పైగా అతన్ని గతంలోనే సస్పెండ్ చేశారని కూడా… తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా వైసీపీ ట్రాప్‌లో పడి.. వారిచ్చే దాని కోసం ఆశ పడి… అచ్చెన్నాయుడి మీదే ఏకంగా స్టింగ్ ఆపరేషన్ చేయడమే కాక… వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీకి పదే పదే క్లీన్ చిట్ ఎందుకిస్తున్నాడు..!?

ఆకుల వెంకటేష్ మాటల్ని వింటే.. ఆయన తన భూవివాద పరిష్కారం చేయలేదన్న కోపంతోనే ఇదంతా చేసినట్లుగా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అదే పనిగా తన వైసీపీ లేదని ఆ పార్టీకి క్లీన్ చిట్ ఇవ్వడం చూస్తూంటే.. ఆయనే తాను ఉద్దేశపూర్వకంగా తిరుపతి ఉపఎన్నికల్లో ఓ పార్టీకి లబ్ది చేకూర్చి టీడీపీని నష్టపరిచేందుకు ప్రణాళిక ప్రకారం వచ్చారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అచ్చెన్నాయుడు మాటల్ని స్టింగ్ చేసి.. వైసీపీ మీడియాకు ఇవ్వడమే కాదు.. వెంటనే.. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి అంశాన్ని కూడా.. తప్పుదోవ పట్టించేందుకు ఆయన వీడియోల ద్వారా ప్రయత్నిస్తున్నారు. తాను చంద్రబాబు పైకి చొక్కా విసిరానని.. రాళ్లు కాదని ఆయన అంటున్నారు. ఓ వైపు పోలీసులు అసలు చంద్రబాబు రాళ్లు కానీ.,.మరే వస్తువులు కానీ పడినట్లుగా సాక్ష్యాలు దొరకలేదని చెబుతున్నారు. మొత్తానికి ఆకుల వెంకటేష్ ఓ ప్రణాళిక ప్రకారం.. తిరుపతికి వచ్చి రచ్చచేస్తున్నట్లుగా టీడీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు.
తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పోయి పదిహేడేళ్లు అవుతోంది. ఆర్థిక అంశాలతో ముడి పెట్టుకుని టీడీపీ పెట్టిన వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఇంకా టీడీపీని పట్టుకుని ఏదో సంపాదించాలనుకునే వెంకటేష్ లాంటి వాళ్లు మాత్రం మిగిలి ఉన్నారు. టీడీపీనే కదా అని పిలిచి వారి సమస్యలు వింటున్న ముఖ్యనేతలు.. వారి హిడెన్ ఎజెండాను గుర్తించలేకపోతున్నారు. చివరికి అలాంటి వాళ్లు స్టింగ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

Updated On 14 April 2021 11:38 AM GMT
subbareddy

subbareddy

Next Story