విధాత: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్టుతో చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. తన నుంచి ప్రేక్షకులు ఇప్పటికీ ఎలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారో…తన నుంచి ఎలాంటి చిత్రాలను ఆశిస్తున్నారో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. రీఎంట్రీకి ముందు చిరుని ఎలా చూడాలని ప్రేక్షకులు ఆశపడేవారు అనే విషయంలో ఓ క్లారిటీ ఉంది. అయితే రీఎంట్రీ తర్వాత ఆయన నుంచి ఎలాంటి చిత్రాలు ఆశిస్తున్నారు? అనే విషయంలో కాస్త డైలమా అయితే ఉండేది. దానికి వాల్తేరు వీరయ్య చెక్ పెట్టింది. మరోసారి తన క్రేజ్ ఏంటి? తన స్టామినా ఏంటి? అనేది ప్రూవ్ చేసుకున్నారు. సరైన మాస్ కమర్షియల్ సినిమా పడితే తనను ఎవరు ఆపలేరని నిరూపించారు. నిర్మాతకు లాభాల వర్షం కురిపిస్తున్నారు.
సైరా వంటి బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రానికి వచ్చినంత కలెక్షన్ ఈ వాల్తేరు వీరయ్యతో చిరు సాధించారు. సైరా తో పాటు వాల్తేరు వీరయ్యతో కూడా 200 కోట్ల క్లబ్ లోకి చేరారు. అలా ఆయన నటించిన రెండు చిత్రాలు ఇప్పుడు 200 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళాశంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన వేదాలం చిత్రానికి రీమేక్. ఒరిజినల్ వర్షన్ లో అజిత్ చేసిన క్యారెక్టర్ ను తెలుగులో చిరు చేస్తున్నారు. ఆయన సరసన తమన్నా నటిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందునున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆగస్టులోపు విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇదే సమయంలో చిరు కొద్ది కాలం కిందట వెంకీ కుడుమలకు ఓకే చెప్పారు. ఛలో, భీష్మ వంటి చిత్రాలతో తనదైన ఎంటర్టైన్మెంట్ను పండించగలిగిన ముద్ర వేసుకున్న వెంకీ కుడుముల పై నమ్మకంతో చిరు ఆయనకు ఓకే చెప్పారు. కానీ చిరు ఈమధ్యన వెంకీ కుడుములకు నో చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ నిజం కాదని తెలుస్తోంది. స్టోరీ లైన్లో కొన్ని అంశాలను చిరు సలహా ప్రకారం మార్చుకొని పూర్తి చేశారట వెంకీ కుడుముల. పూర్తి స్క్రిప్టును మరోసారి విన్న తర్వాత చిరు ఈ సినిమా చేసే విషయమై పై పూర్తి క్లారిటీతో ఉన్నారు. చిరుకి సబ్జెక్టు నచ్చితే బోళా శంకర్ వెంటనే గ్యాప్ లేకుండానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వేదాళం రీమేక్ కాబట్టి మరోసారి రీమేక్ చేయకుండా స్ట్రైట్ చిత్రాన్ని చేయాలని ఆలోచనలోనే చిరు ఉన్నాడట..!