Amaravati Scam
- ఏ – 1 గా చంద్రబాబు ఏ – 2 గా నారాయణపై కేసులు
విధాత: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు సీఐడీ గట్టి షాక్ ఇచ్చింది. అమరావతి భూ కుంభకోణంలో ఆధారాలు సేకరించాం అంటూ కేసులు బుక్ చేసిన సీఐడీ దర్యాప్తులో భాగంగా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని చంద్రబాబును ఆయనకు సహకరించిన నారాయణకు చెందిన ఆస్తులు ఎటాచ్ చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబుకు చెందిన కరకట్ట ఇంటిని ఎటాచ్ చేసింది. దీంతో బాటు ఆయన సన్నిహితులకు చెందిన కొన్ని ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సైతం సీజ్ చేసింది.
వాస్తవానికి అమరావతి అనేది భారీ కుంభకోణం అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా అమరావతి కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్లోనూ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లోనూ, కంతేరు, కాజ, నంబూరుల్లో జోనల్ డెవలప్మెంట్ ప్రణాళికల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి.
చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను సైతం పూర్తిగా పక్కనబెట్టి తమకు నచ్చినట్లు ప్లాన్లు మార్చేసి తమకు అనుకూలురు అయిన లింగమనేని వంటివారి పొలాలు, భూములు పోకుండా కాపాడారు అన్నది ప్రధాన మైన కేసు. ఇందులో భాగంగా చంద్రబాబుతోబాటు అప్పటి పురపాలక మంత్రి పొంగూరు నారాయణ తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
అలా వారికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు లింగమనేని రమేష్ నుంచి ప్రతిఫలంగా గెస్ట్హౌస్ తీసుకున్నారని సీఐడీ గుర్తించింది. దీంతో వారి ఆస్తులు ఎటాచ్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని సీఐడీ విభాగం ప్రభుత్వాన్ని కోరగా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న ప్రభుత్వం. ఈ క్రమంలో లింగమనేని రమేష్ కు చెందిన పలు ఆస్తులను సీఐడీ జప్తు చేసింది.
సీఐడీ జప్తు చేసిన ఆస్తులు..
- అమరావతి ప్రాంతంలోని 75880 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు
- ఉద్దండ రాయుని పాలెంలో 2040 గజాల 2 ప్లాట్లు
- రాయపూడిలో 18140 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు
- లింగాయపాలెంలో 12440 గజాల ప్లాట్లు
- మందడంలో 39640 గజాల ప్లాట్లు
- కొండమరాజు పాలెంలో 3180 గజాల ప్లాట్లు
- రామకృష్ణ హౌసింగ్ ఎండీ కేపీవీ అంజనీకుమార్కు చెందిన రాయపూడిలోని 2 ఎకరాల భూమినీ సైతం సీఐడీ జప్తు చేసింది.
- దీంతోబాటు పొట్లూరి ప్రమీలకు చెందిన హైదరాబాద్ చందానగర్ బ్రాంచిలో రూ.40.88లక్షలు,
- రాపూరి సాంబశివరావుకు చెందిన రూ. 60.94లక్షలు నెల్లూరులోని ఆచారి స్ట్రీట్ ఎస్బీఐసీలో అటాచ్
- ఆవుల శంకర్కు చెందిన బెంగుళూరు ఎంజీ రోడ్లోని హెడ్డీఎఫ్సీలోని రూ.69,16502 అటాచ్
- ఇదే బ్రాంచిలో కోతప వరుణ్కుమార్ పేరిట ఉన్న రూ. 21,11660 నగదును సైతం ఎటాచ్ చేసింది.
అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నాటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ కీలకంగా ఉండేవారు. తమ వారికి అనుకూలంగా ఉండేలా ప్లాన్ మార్చాలి అంటూ అధికారులకు సూచనలు చేసేవారు. దీంట్లో భాగంగానే లింగమనేనికి, హెరిటేజ్ భూములకు అనుకూలంగా ఇన్నర్ రింగ్రోడ్డు లైన్మెంట్ మార్చారు. నారాయణ విద్యాసంస్థలకు అనుకూలంగా ఈ అలైన్ మెంట్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.
ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ వివరాలను ముందుగానే లింగమనేని లీక్ చేశారు. దీంతో ఇన్నర్ రింగ్రోడ్డు గుండా వెళ్తున్న కొన్ని భూములను లింగమనేని రమేష్ 2015లో అధిక ధరకు ఇతరులకు విక్రయించుకున్నారు. దీనికి ప్రతిఫలంగా కృష్ణానది ఒడ్డున కరకట్టలోపల ఉన్న గెస్ట్హౌస్ను చంద్రబాబుకు ఉచితంగా కట్టబెట్టారు.