- తన నియోజకవర్గంలో అంతర్గత సర్వే
- షాక్ ఇచ్చిన ఫలితాలు..
- అందుకే త్యాగాలు చేస్తున్నారంటున్న పరిశీలకులు
విధాత: త్వరలో ఏపీ కేబినెట్లో మార్పులు.. కొందరు కొత్తవారికి అవకాశాలు అనే వార్తలు వస్తున్న తరుణంలో ఒక మంత్రికి భవిష్యత్ అర్థమైందా ?? కేబినెట్ మార్పులు.. చేర్పుల్లో తనకు ఉద్వాసన తప్పదని తెలిసిందా..?? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి 2019లో గెలిచిన సీదిరి అప్పలరాజు ఉన్నఫళంగా మంత్రి అయిపోయారు.
అదే ఆయన్ను ఉన్నచోట నిలువనీయడం లేదు.. దీంతో అటు పార్టీకి.. నియోజకవర్గ ప్రజలకు కూడా పెద్దగా ఫాయిదా లేదని జగన్.. పార్టీ పెద్దలు ఫీలవుతున్నారట. అందుకే ఆయన్ను తొలగించడం తప్పదని అంటున్నారు. అయితే తాను ముందుగానే జాగ్రత్తపడి అవసరం అయితే తానే తప్పుకుంటానని అంటున్నారు.
సొంత పార్టీ నేతల నుంచే నిరసనలు..
ఒకేల ఈయన తప్పుకోకున్నా జగన్ తప్పించేలా ఉన్నారని అంటున్నారు. ఆయన వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు వస్తున్నాయి. సొంత పార్టీ నాయకులే ఆయనను ఓడిస్తామంటూ.. కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీదిరికి టికెట్ ఇవ్వొద్దని అంటున్నారు. కొందరు అసమ్మతి నాయకులకు పార్టీ అధిష్టానం చీవాట్లు పెట్టినా వారు మారేది లేదని, అప్పలరాజును మార్చాల్సిందేనని అంటున్నారు.. దీంతో సీదిరి సొంత సర్వే చేయించుకున్నారని తెలుస్తోంది.
పదవికి రాజీనామా చేస్తా…!!
నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఏమనుకుంటోంది.. వచ్చే ఎన్నికల్లో తనకు ఉన్న అవకాశాలు ఏంటి? అనే అంశాలపై ఆయన అంతర్గత సర్వే చేయించుకుని.. సమాచారం సేకరించినట్టు సమాచారం. దీంతో తన సొంత సామాజిక వర్గంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించారుట. ఈసారి ఆయన ఓటమి కూడా కన్ఫామ్ అని తేలడంతో కాస్త బుద్దిగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
మత్య్సకార సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని.. ఇప్పటికే నలుగురికి ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇచ్చారని… అవసరమైతే.. తాను పదవికి రాజీనామా చేస్తానని.. చెప్పుకొచ్చారు. ఈ త్యాగం వెనుక.. మత్య్సకార వర్గాన్ని మరోసారి తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారని అంటున్నారు పరిశీలకులు.