పరిష్కారాలు మాత్రం సత్వరమే చేయాలి ఇంజినీర్లు చైతన్యంగా ఉండాలి అద్దాల మాదిరిగా రోడ్లు డిసెంబర్ 15లోగా మరమ్మతులన్నీ పూర్తి కావాలి పంచాయతీరాజ్, రోడ్లు భవనాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ విధాత: పరిపాలనా సంస్కరణల అమలుకు వీలుగా క్షేత్ర స్థాయిలో మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవాలని రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రెండు శాఖల మంత్రులు, అధికారులతో గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన […]

పరిష్కారాలు మాత్రం సత్వరమే చేయాలి
ఇంజినీర్లు చైతన్యంగా ఉండాలి
అద్దాల మాదిరిగా రోడ్లు
డిసెంబర్ 15లోగా మరమ్మతులన్నీ పూర్తి కావాలి
పంచాయతీరాజ్, రోడ్లు భవనాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
విధాత: పరిపాలనా సంస్కరణల అమలుకు వీలుగా క్షేత్ర స్థాయిలో మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవాలని రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రెండు శాఖల మంత్రులు, అధికారులతో గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలన్నారు.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా మీ శాఖల్లో పరిపాలన సంస్కరణలు అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మరింత మంది ఇంజనీర్లను నియమించుకోవాలని ఈ రెండు శాఖలను ఆదేశించారు.
ఐదారు నియోజకవర్గాలకు ఒక ఎస్ఇ ఇతర శాఖల మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలని సీఎం అన్నారు. ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ ఈ ఉండే విధంగా టెర్రిటోరియల్ సీ ఈలను కూడా నియమించాలన్నారు.
పటిష్టంగా పనులు జరగాలంటే ఎస్ఈల సంఖ్య, ఈఈల సంఖ్య ఎంత వుండాలో ఆలోచన చేయాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని సీఎం అన్నారు.
సత్వర నిర్ణయం.. తక్షణ పరిష్కారం
శాఖల్లో బాధ్యతల పునర్విభజన, వానలకు, వరదలకు కొట్టుకు పోయిన రోడ్ల (ఎఫ్ డీ ఆర్) కు మరమ్మతుల నిర్వహణ, తదితర పనులకు కిందిస్థాయి ఇంజినీర్లు సత్వర నిర్ణయం తీసుకుని పనులు చేపట్టాలన్నారు. ఆ దిశగా నిధుల కేటాయింపు, వంటి మార్గాలను అవలంబించాలన్నారు. ఇందుకు సంబంధించి వర్క్ షాపులు నిర్వహించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు.
దమ్ము చక్రాల(కేజీ వీల్స్)తో రోడ్లపై ట్రాక్టర్లు నడుపొద్దు
గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు పాడవుతున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ దిశగా రైతులను, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లను చైతన్యం చేయాలని, ఇందుకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు.
డిసెంబర్ 15లోగా మరమ్మతులు పూర్తి కావాలి
వచ్చే నెల రెండో వారం లోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ ఏమూలన పాడయ్యాయో సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజినీర్ల దగ్గర వుండాలన్నారు. రోడ్లు మరమ్మతు ఒక నిరంతర ప్రక్రియగా భావించాలన్నారు.
సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, సంజీవరావు, ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సత్యనారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
