Asia Cup 2023 |
ఈ ఏడాది ఆసియా కప్ జరగాల్సి ఉన్నది. కొంతకాలంగా హోస్టింగ్ విషయంలో వివాదం నెలకొన్నది. ఈ టోర్నీకి ఆతిథ్యం పాక్ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా మాత్రం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించబోదని గత ఏడాది ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల్లో టోర్నీని తటస్థ వేదికగా నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే, దీన్ని పాక్ వ్యతిరేకిస్తున్నది. ఈ సందర్భంగా హైబ్రిడ్ మోడల్ను ఆఫర్ చేసింది. ఈ క్రమంలోనే పాక్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాక్కు రావాలన్నాడు.
పాక్కు భారత్ రాకపోవడంపై మనం మాట్లాడకూడదని, భారత్ పాక్కు వచ్చి ఆడాలన్న స్టాండ్ను మనం స్పష్టం చేయాలని చెప్పాడు. స్టీవ్ స్మిత్, జో రూట్, జేమ్స్ అండర్సన్ పాక్లో ఎలా ఆడుతున్నారో.. అలాగే పాక్లో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ చూడాలని పాక్ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రతి జట్టు పాక్కు వస్తుందన్నాడు.
పాక్కు వచ్చి ఆడాలని ఏ జట్టును కోరవద్దని, పాక్కు క్రికెట్ రావాలని, జట్టు వచ్చి క్రికెట్ ఆడాలనేది మా హక్కు అన్నారు. క్రికెట్ను తిరిగి పాక్కు తీసుకువచ్చేందుకు ఆటగాళ్లు, పీసీబీ చాలా పోరాడిందని, బలగాలు, ఇంటెలిజెన్స్, ఆర్మీ కీలకపాత్ర పోషించాయని చెప్పాడు. పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ రావాలని, ఇక్కడికి వచ్చే ప్రతి జట్టు పాకిస్థాన్కు మద్దతివ్వాలని భావిస్తున్నానని, తాము జట్లకు ఆతిథ్యం ఇచ్చే విధానం, ప్రపంచంలో తమకు సరిపోయే దేశం ఏదీ ఉండదన్నాడు.
ఆసియా కప్ విషయంలో పాక్కు ఎదురుదెబ్బ
ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో పాక్కు ఎదురుదెబ్బ తగిలింది. టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను సభ్య దేశాలు తిరస్కరించాయి. దాంతో ఆసియా కప్ను తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో విపరీతమైన వేడి ఉంటుందని, దాంతో ఆటగాళ్లు గాయపడే అవకాశాలున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
అలాంటి పరిస్థితిలో ఆరు దేశాల టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే రేసులో శ్రీలంక ముందంజలో ఉంది. అయితే, పీసీబీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మోడల్లో పాక్ తన మ్యాచులన్నీ స్వదేశంలో ఆడుతుంది. భారత్తో జరిగే మ్యాచ్లను యూఏఈ, దుబాయి, ఒమన్ లేదంటే శ్రీలంకలో ఎక్కడైనా ఆడేందుకు అవకాశం ఉంటుంది.