Bhatti Vikramarka ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం నేతన్నల దీక్షకు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు భట్టి సంఘీభావం 51వ రోజు పోచంపల్లిలో కొనసాగిన పాదయాత్ర విధాత: ఆత్మహత్యలు లేనటువంటి చేనేత కార్మికుల జీవితాలను చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా రానున్న ఇందిరమ్మ రాజ్యంలో చేనేత రంగానికి పెద్ద పీట వేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 51వ రోజు భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలంలో కొనసాగింది. […]

Bhatti Vikramarka

  • ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం
  • నేతన్నల దీక్షకు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు భట్టి సంఘీభావం
  • 51వ రోజు పోచంపల్లిలో కొనసాగిన పాదయాత్ర

విధాత: ఆత్మహత్యలు లేనటువంటి చేనేత కార్మికుల జీవితాలను చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా రానున్న ఇందిరమ్మ రాజ్యంలో చేనేత రంగానికి పెద్ద పీట వేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 51వ రోజు భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలంలో కొనసాగింది. పోచంపల్లి చేనేత సహకార సొసైటీ కార్యాలయం ఎదురుగా చేనేత సమస్యలపై దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి సీఎల్పీ నేత భట్టి సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ధనిక రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇవ్వాల్సిన సబ్సిడీ రాయితీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో విధానం తీసుకువచ్చి అనేక కొర్రీలు పెట్టడం దుర్మార్గమన్నారు. జియో ట్రాకింగ్ పేరుతో రాష్ట్రంలో కేవలం 17 లక్షల మంది చేనేత కార్మికులు మాత్రమే ఉన్నారని నేతన్నల సంఖ్యను తక్కువ చూపించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికులకు 350 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకువచ్చిన పాలకులు తలదించుకోవాలన్నారు. చేనేత ఆకలి చావులు వారి సమస్య కాదని అది సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోకుంటే సమాజానికి పెద్ద నష్టమని భావించిన స్వర్గీయ వైయస్సార్ అనేక సబ్సిడీలు, రాయితీలు తీసుకొచ్చారని వెల్లడించారు.

చేనేతరంగాన్ని వ్యాపార కోణంతో చూడకుండా నాగరికత అంశంగా ప్రభుత్వం గుర్తించి వారికి అందివ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహాలు జాప్యం జరగకుండా ఇవ్వాలన్నారు. చేనేత నూలుపై కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టి 18%, రాష్ట్ర ప్రభుత్వం విధించే నాలుగు శాతం పన్నులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తే నేత కార్మికులకు సమగ్రమైన నిధులు వస్తాయని, పరిహారం కోసం పదిలక్షలు ఇవ్వాలని కోరుతున్న చేనేత కార్మికుల కోరిక చాలా చిన్నదిగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత నూలుపై ఇచ్చే సబ్సిడీ సక్రమంగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఒకసారి అందిస్తామని వెల్లడించారు.

మరమగ్గాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని కోరుతున్న నేత కార్మికుల కోరికను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పోచంపల్లి మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న 10 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం మూడేళ్లుగా ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై మండి పడ్డారు. బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని, ఈ సమస్య పై అధికారులతో మాట్లాడుతానని వారికి భరోసా ఇచ్చారు. రైతు భీమా తరహా లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత బీమా పథకం తీసుకొస్తామని వెల్లడించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన సబ్సిడీలు సకాలంలో ఇవ్వడం లేదని అడిగినందుకు చేనేత సొసైటీ పాలకవర్గ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ఆరు నెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా ప్రభుత్వ అప్రజా సామికంగా వ్యవహరించడం తగదని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న పదిమంది చేనేత కుటుంబాలకు అందాల్సిన పరిహారం ప్రభుత్వం మూడేళ్లుగా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. పదిమంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున తాను ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించి వారికి ఓదార్పు కలిగించారు.

కనీస వేతన చట్టం అమలు చేయకపోవడం పెద్ద నేరం

పార్లమెంట్‌లో చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం పెద్ద నేరంగా భావించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని భూదాన్ పోచంపల్లి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులతోపాటు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి లేఖ రాస్తానని వెల్లడించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీస వేతనం నిర్ణయం పై సమీక్షలు జరపడం లేదని అన్నారు. సమీక్షలు జరగకపోవడం వల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నిర్ణయం కాకపోవడంతో కార్మికులు ఉద్యోగులు నష్టపోతున్నారని దీనికి ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయకుంటే ఐదు నెలల తర్వాత అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Updated On 6 May 2023 10:22 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story