Bhumi Caravan-2
- స్టేషన్ ఘన్పూర్ వరకు యాత్ర
- రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటాం
- తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో రూపొందిస్తాం
- లీఫ్స్ ప్రతినిధుల వెల్లడి
విధాత: రైతుల న్యాయ అవసరాలు, వారి భూమి ఆకాంక్షలు తెలుసుకోవడం కోసం తెలంగాణ భూమి కారవాన్ – 2 యాత్ర రెండో విడతను ఈ నెల 8న భువనగిరి నుంచి ప్రారంభించనున్నట్టు లీఫ్స్ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి, లీఫ్స్ సలహాదారుడు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి దేశాయి తెలిపారు.
భువనగిరి నుంచి మొదలయ్యే యాత్ర చాడ ముత్తిరెడ్డి గూడెం ఆత్మకూరు, మోత్కూరు, గుండాల, దేవురుప్పల, విస్నూరు, పాలకుర్తి మీదుగా ఘనపూర్ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో రైతులకు సాయం అందించే ప్రయత్నం కొనసాగిస్తామని తెలిపారు.
2014లో 2500 కి.మీ. యాత్ర
2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న సందర్భంలో భూమి హక్కులు, భూపరిపాలనకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోవడానికి భూమి కారవాన్ నిర్వహించామని వారు తెలిపారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో దాదాపు 2500 కిలోమీటర్లు తిరిగి, దాదాపు 5000 మందితో మాట్లాడామని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా “తెలంగాణ ప్రజల భూమి మానిఫెస్టో” రూపొందించామని తెలిపారు.
గడిచిన తొమ్మిదేళ్ల అనుభవాల నేపథ్యంలో ప్రజలు ఇప్పటి ఆకాంక్షలను తెలుసుకోవడానికి మరోసారి భూమి కారవాన్ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని భావించి ఒక చారిత్రక రోజు నాడు (10 ఏప్రిల్) ఒక చరిత్రాత్మక ప్రదేశం (భూదాన్ పోచంపల్లి) నుండి భూమి సునీల్ ఆధ్వర్యంలో లీఫ్స్ సంస్థ తెలంగాణ భూమి కారవాన్ – 2 ను ప్రారంభించామని పేర్కొన్నారు.
ఈ కారవాన్ ద్వారా రైతుల న్యాయ అవసరాలను తెలుసు కోవాలనుకుంటున్నామని చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలను రూపొందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రైతులను కలిసి 1) భూ సమస్యల పరిష్కారానికి, మరింత మెరుగైన భూపరిపాలన కోసం ప్రభుత్వం ఇంకా ఏమి చెయ్యాలి?, 2) సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటి? అని అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, వాటి ఆధారంగా మరోసారి తెలంగాణ ప్రజల భూమి మానిఫెస్టో రూపొందిస్తామని వివరించారు. రైతుల న్యాయ అవసరాలపై నివేదిక తయారు చేస్తామని వారు పేర్కొన్నారు.