విధాత: ఇప్పటిదాకా దొంగతనం అంటే.. ఏదో చాటుమాటుగా చేసేదిగా ఉండేది. ఇప్పుడు దొంగలు తెలివి మీరారు. దేన్నైనా.. ఎంత పెద్దదాన్నైనా మటుమాయం చేస్తున్నారు. బిహార్ పాట్నాలో దొంగలు ఏకంగా ఓ సెల్ టవర్నే ఎత్తుకెళ్లారు! పాట్నాలోని సబ్జీబాగ్ ప్రాంతంలో ఓ ఇంటిమీద గుజరాత్ టెలి లింక్ (జీటీఎల్) సెల్ టవర్ను నిర్మించింది. దానిపై దొంగల కన్ను పడింది. నాలుగు నెలల క్రితం జీటీఎల్ ఉద్యోగులం అంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడారు. సెల్ టవర్లో […]
విధాత: ఇప్పటిదాకా దొంగతనం అంటే.. ఏదో చాటుమాటుగా చేసేదిగా ఉండేది. ఇప్పుడు దొంగలు తెలివి మీరారు. దేన్నైనా.. ఎంత పెద్దదాన్నైనా మటుమాయం చేస్తున్నారు. బిహార్ పాట్నాలో దొంగలు ఏకంగా ఓ సెల్ టవర్నే ఎత్తుకెళ్లారు!
పాట్నాలోని సబ్జీబాగ్ ప్రాంతంలో ఓ ఇంటిమీద గుజరాత్ టెలి లింక్ (జీటీఎల్) సెల్ టవర్ను నిర్మించింది. దానిపై దొంగల కన్ను పడింది. నాలుగు నెలల క్రితం జీటీఎల్ ఉద్యోగులం అంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడారు. సెల్ టవర్లో ఏదో రిపేర్ ఉన్నట్లు చెప్పి, రిపేర్ చేసినట్లు చేసి వెళ్లారు.
ఆ తర్వాత.. వచ్చి మళ్లీ రిపేరు చేయాలని భవనం మీదికి పోయారు. సెల్ టవర్ను విప్పేసి చిన్న ఇనుప కడ్డీలుగా, ఊచలుగా మార్చి వాటిని తరలించుకుపోయారు. ఆ తర్వాత అనుకోకుండా ఇంటి యజమాని వెళ్లి చూస్తే.. ఇంటిపై టవర్ కనిపించలేదు. దీంతో వెంటనే విషయాన్ని ఆయన జీటీఎల్ అధికారులకు తెలియజేశారు.
జీటీఎల్ అధికారులు వచ్చి సెల్ టవర్ తీరు చూసి విస్తుపోయారు. టవర్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టారు. అయినా ఏమీ తేలలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం ఏమంటే.. సెల్ టవర్ దొంగతనానికి గురి కావటం ఇదే మొదటి సారి కాదు. గత సంవత్సరం నవంబర్లోనూ బిహార్లో ఓ సెల్ టవర్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.
ఇలాంటి దొంగతనం బిహార్లో ఇదే మొదటిది కాదు. గతంలో బిహార్లోనే ఓ రైలింజన్ కూడా దొంగతనానికి గురైంది. అంతేకాదు.. ఓ నదిపై నిర్మించిన ఇనుప వంతెనను కూడా దొంగలు రాత్రికి రాత్రి మాయటం చేశారు.