Biodiversity Award | నలుగురి కోసం బతికిన ఇద్దరి కథ
Biodiversity Award విధాత: గోవా(Goa) రాష్ట్రం పర్యావరణ ప్రేమికులకు బయోడైవర్సిటీ అవార్డు(Biodiversity Award)లను మంగళవారం ప్రకటించింది. వీరిలో ఇద్దరు అందరి దృష్టినీ ఆకర్షించారు. వారే 74 ఏళ్ల బాలకృష్ణ అయ్య, 80 ఏళ్ల రుక్మిణి పాండురంగ్. బాలకృష్ణ తన ప్రాంతంలో కమ్యూనిటీ కోసం సొంతంగా బావిని నిర్మించగా.. రుక్మిణి మొన్న మొన్నటి వరకు పాములు కాటు వేసిన వారి ఇంటికి స్వయంగా వెళ్లి వైద్యం చేసేది. ఊరి కోసం బావి… లోయిలం ప్రాంతానికి చెందిన బాలకృష్ణ స్కూల్లో […]
Biodiversity Award
విధాత: గోవా(Goa) రాష్ట్రం పర్యావరణ ప్రేమికులకు బయోడైవర్సిటీ అవార్డు(Biodiversity Award)లను మంగళవారం ప్రకటించింది. వీరిలో ఇద్దరు అందరి దృష్టినీ ఆకర్షించారు. వారే 74 ఏళ్ల బాలకృష్ణ అయ్య, 80 ఏళ్ల రుక్మిణి పాండురంగ్. బాలకృష్ణ తన ప్రాంతంలో కమ్యూనిటీ కోసం సొంతంగా బావిని నిర్మించగా.. రుక్మిణి మొన్న మొన్నటి వరకు పాములు కాటు వేసిన వారి ఇంటికి స్వయంగా వెళ్లి వైద్యం చేసేది.
ఊరి కోసం బావి…
లోయిలం ప్రాంతానికి చెందిన బాలకృష్ణ స్కూల్లో ఆర్ట్ టీచర్గా, బయట శిల్పిగా పనిచేసే వాడు. దశాబ్దం క్రితం.. తన పల్లె నీటి ఎద్దడితో బాధ పడుతోందని గుర్తించాడు. అనుకుందే తడవుగా తను సంపాదించిన దాంట్లో రూపాయి రూపాయి కూడబెడుతూ.. బావిని నిర్మించాడు. 20, 25 ఇళ్లు ఉన్న ఆ గ్రామంలో ఒక్కరు కూడా ఆయనకు సాయం రాలేదు.
ఎందుకంటే అతడు తన కుటుంబం కోసమే తవ్వుతున్నాడని వారంతా భావించారు. ఆఖరికి 40 మీటర్ల లోతు తవ్వాక నీరు పడటంతో బాలకృష్ణ ఆనందానికి అంతు లేదు. ఇది తన ఒక్కడి కోసమే కాదని.. ఊరందరి కోసమని చెప్పాడు. వెంటనే బావికి పైపు ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి నీరు సరఫరా అయ్యేలా చేశాడు.
ఇంటి ఇంటికీ వెళ్లి వైద్యం..
బగ్వాడాకు చెందిన రుక్మిణిది మరో రకమైన సమాజ సేవ. 19 ఏళ్లకే వివాహమై అత్తవారింట అడుగుపెట్టిన ఆమె.. తన మావయ్య దగ్గర పురాతన వైద్యం నేర్చుకుంది. మూలికలు నూరడం, సేకరించడం చేస్తూ క్రమంగా దానిపై పట్టు సాధించింది. ఆయన తదనంతరం ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే మా ఇంటి తలుపు తట్టేవారని రుక్మిణి ఆనందపడుతూ చెబుతుంది.
ముఖ్యంగా పాము కాట్ల సమస్య అయితే తనే స్వయంగా వెళ్లి వైద్యం చేసేది. ఎవరి దగ్గరా ఫీజు అడిగేది కాదు.. వారు ఎంత ఇస్తే అంతే. అయితే వయోభారం వల్ల ఇప్పుడు తాను రోగుల దగ్గరకు వెళ్లడం లేదని రుక్మిణి చెప్పింది. తన ముగ్గురు కుమారుల్ని ఈ వైద్యంలో నిష్ణాతుల్ని చేశానని వారు ఇక తన బాధ్యతను ముందుకు తీసుకెళ్తారని గర్వంగా వెల్లడించింది.