విధాత: రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. విభజించు పాలించు విధానాన్ని ఆ పార్టీ అవలంబిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ను వల్లబాయ్ పటేల్ నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతున్నదని, అదానీ పోర్ట్ నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. అదానీపై మాట్లాడినందుకే రాహుల్పై వేటు వేశారు. రాహుల్గాంధీని చూసి ప్రధాని నరేంద్రమోడీ భయపడుతున్నారు.
మోడీ, అమిత్ షాలు డొల్ల కంపెనీలతో అదానీ పెట్టుబడులు పెట్టారని రేవంత్ ఆరోపించారు. ఈ పెట్టుబడులపై ఈడీ విచారణ కోరినందుకే రాహుల్ను అడ్డుకున్నారు. బీజేపీ నేతల్లో చాలామందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
డబుల్ ఇంజిన్ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అన్నారు. అందుకే అదానీ ఇంజిన్కు రిపేర్ వచ్చిందని ప్రధానికి భయం పట్టుకున్నది. భగత్సింగ్ వారసుడిగా రాహుల్ ఎవరికీ తలవంచరు, క్షమాపణలు చెప్పరని రేవంత్ తేల్చిచెప్పారు. మరో స్వాతంత్ర్య ఉద్యమం చేయాల్సిన బాధ్యత యువతపై ఉన్నదన్నారు.