Brijbhushan |
- ఒకవేళ వస్తే దేశానికి ఏ సంకేతం అందుతుంది?
- క్రమశిక్షణా నోటీసు ఉంటే క్రీడాకారులను ప్రధానితో కలువనివ్వరు
- మరి అనేక లైంగిక ఆరోపణలు ఉన్న సింగ్ పార్లమెంట్కు వస్తే ?
- దేశం ఎటువైపు పయనిస్తోందో అర్థం చేసుకోవచ్చు
- కామన్వెల్త్ గేమ్స్ బంగార పతక విజేత వినేశ్ పోగాట్
- బ్రిజ్భూషన్ను అరెస్టు చేయాల్సిందే : యోగా గురు బాబా రామ్దేవ్
విధాత: ఢిల్లీలో ఆదివారం నిర్వహించే పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ ఐ) చైర్మన్ బ్రిజ్ భూషణ్ (Brijbhushan) శరణ్సింగ్ హాజరైతే దేశానికి స్పష్టమైన సంకేతం అందుతుందని కామన్వెల్త్ గేమ్స్ బంగార పతక విజేత, మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అన్నారు.
ఒకవేళ సింగ్ హాజరైతే తమ పంచాయతీ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు. బాలికసహా ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగికవేధింపులకు గురిచేసిన బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్లు, ఒలింపిక్స్ పతక విజేతలు వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ నిరవధిక ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
నిరసన కొత్త పార్లమెంట్ భవనం వద్ద
సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నరెజ్లర్లు ఆదివారం ప్రధాని ప్రారంభించే నూతన పార్లమెంటు భవనం ఎదుట మహిళా మహాపంచాయత్ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆదివారం ప్రారంభించే కొత్త పార్లమెంటులో బ్రిజ్ భూషణ్ ఉంటే, అప్పుడు దేశం మొత్తానికి స్పష్టమైన సంకేతం వస్తుంది.
బ్రిజ్ భూషణ్ను రక్షించేందుకు ఎవరు ప్రయత్నించినా, మాకు వ్యతిరేకమే. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతోందో నాకు తెలియదు. కానీ ఎవరో అతనికి రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అది సరికాదు. అతను ఈ దేశంలోని మహిళలకు హాని చేస్తున్నాడు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
మమ్మల్ని ఆహ్వానించకుండా .. సింగ్ను ఆహ్వానిస్తే
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రెజ్లర్లను ఆహ్వానించకుండా డబ్ల్యూఎఫ్ఐ చైర్మన్ సింగ్ను ఆహ్వానిస్తే ఏం చేస్తారని శుక్రవారం మీడియా ప్రశ్నించగా.. వినేశ్ ఒక ఉదాహరణ చెప్పారు. ‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి నాపై ఒక లేఖ జారీ అయితే, దాని ఆధారంగా, సింగ్ నన్ను ప్రధానిని కలవకుండా ఆపగలడు. నా పేరును జాబితా నుంచి తొలగించగలడు, అప్పుడు ఊహించుకోండి, అతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన ఆదివారం పార్లమెంటుకు హాజరవుతున్నారంటే దేశం ఎటువైపు పయనిస్తోందో అర్థం చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
అతడిని కటకటాల వెనక్కి పంపాలి
బాలికసహా ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ ఐ) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ తక్షణమే అరెస్టు చేయాలని యోగా గురు బాబా రామ్దేవ్ డిమాండ్ చేశారు. అతడు కటకటాల వెనుక ఉండాల్సిన వ్యక్తి అని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్కు శనివారం రాందేవ్ బాబా మద్దతు పలికారు.
‘‘దేశంలోని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద కూర్చుని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. అలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపాలి. రోజూ తల్లులు, సోదరీమణులు, కుమార్తెల గురించి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ఇది చాలా ఖండించదగిన దుష్ట చర్య. పాపం కూడా’ అని రామ్దేవ్ అన్నారు.