విధాత, యాదగిరిగుట్ట: యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని స్వామి వారిని సేవించి తరించారు. దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి (Shri Ganapati Satchidananda Swami) గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి చేరుకున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy), ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను శ్రీ సచ్చిదానంద స్వామి పరిశీలించారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ రచయిత సినీ నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) కూడా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరిగుట్ట ఆలయం అద్భుత శిల్పకళాతో శోభయమానంగా కనువిందు చేస్తుందని తనికెళ్ల భరణి అన్నారు.
స్వామి వారి అభిషేకానికి హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన భక్తుడు శ్రీగిరి శ్రీనివాసచారి దంపతులు 2కిలోల 675 గ్రాముల వెండి బిందెను ఆలయానికి బహుకరించారు. స్వామి వారికి నిత్యారాధనలో భాగంగా నిత్యభిషేకాలు, సుదర్శన నారసింహ హోమం, ఏకాదశి పురస్కరించుకొని లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శుక్రవారం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవత్సవం నిర్వహించారు.