E-Pharmacy | ఆన్లైన్లో మందుల విక్రయాలు (E-Pharmacy)ని కేంద్రం నిషేధించే అవకాశమున్నది. దీనికి కేంద్ర మంత్రుల బృందం సైతం మద్దతు తెలిపింది. ఆన్లైన్లో మందుల విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గత నెలలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ 20 కంపెనీలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫార్మసీని అదుపులోకి తెచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో బ్యాన్ను మంత్రులబృందం ముందుంచడంతో పాటు కొత్త బిల్లుపై సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. విక్రయాలతో డేటా గోప్యత, ఓవర్ ది కౌంటర్ డ్రగ్ విక్రయాలు, ఏకపక్ష ధరలకు దారితీస్తోందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఇది చాలా ప్రమాదకరమైందని, దీని కారణంగా మార్కెట్ బలహీనపడుతోందని భావిస్తున్నారు. ఈ-ఫార్మాసీ డ్రగ్స్కు సంబంధించిన డేటాను సేకరించగలదని, ఇది రోగి భద్రతకు సంబంధించి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
20 కంపెనీలకు నోటీసులు..
అయితే, ఈ విషయంలో ఇంకా ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ బడ్జెట్ సెషన్లో ఆన్లైన్ మందుల విక్రయాలను సమగ్రంగా నియంత్రించేందుకు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే క్రమంలో మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (DCGI) అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, వన్ ఎంజీ సహా 20 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్లో మందుల విక్రయాల్లో కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఈ కంపెనీలు షెడ్యూల్ హెచ్ను నడుపుతున్నాయని ధ్వజమెత్తింది. మరో వైపు వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల బిల్లు 2023 (Medical Devices and Cosmetics Bill 2023) ముసాయిదాను అంతర్ మంత్రిత్వశాఖ సంప్రదింపుల కోసం పంపారు. దాంతో ఆన్లైన్ ద్వారా ఏవైనా ఔషధ విక్రయాలను నియంత్రించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త డ్రగ్స్ మెడికల్ డివైసెస్ అండ్ కాస్మెటిక్స్ బిల్లు 2023.. ప్రస్తుతం ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940తో భర్తీ చేయవచ్చని కేంద్రం భావిస్తున్నది.