- BJP నియోజకవర్గ కన్వీనర్ రతన్ సింగ్
- చెరువులు కాల్వల్లోకి వ్యర్థ జలాలు వదులుతున్న యాజమాన్యాలు..
- మృత్యువాత పడుతున్న చేపలు, పశుపక్షాదులు
విధాత: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని రైసుమిల్లులు చేస్తున్న జల, వాయువు, ధ్వని కాలుష్యంపై ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు వీడియోతో సహా ఫిర్యాదు చేసినట్టు బిజెపి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బి.రతన్ సింగ్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణ పరిసర ప్రాంతాలలో వందకు పైగా రైస్ మిల్లులను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. మిల్లుల నిర్వాహకులు బాయిల్డ్ వాటర్ శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా సమీపంలోని చెరువులు కాల్వల్లోకి వ్యర్థ జలాలు వదులుతున్నారని ఆరోపించారు. కలుషిత జలాలు తాగి చేపలు జలచరాలతో పాటు పశు పక్షాదులు మృత్యువాత పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
రైస్ మిల్లుల నుంచి వస్తున్న పొగ, బూడిద, పొట్టు, బాయిల్డ్ వాటర్ వల్ల జల, వాయు కాలుష్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు చైతన్య వంతులై కాలుష్య నియంత్రణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయ్, నరేష్, లాలు, సైదా, ఉమ్లా, నాగేశ్వరావు నాయక్లు పాల్గొన్నారు.