క్యాడర్ కేటాయింపు వివాదంపై కీలక తీర్పు వెల్లడించిన హైకోర్టు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఏపీకీ కేటాయించినా.. తెలంగాణలోనే తిష్ట క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలు చేసినట్లు ప్రచారం పాత కేసుల విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటులో తాత్సారం ధరణి సమస్యలు చుట్టుముడుతున్నా పట్టింపు లేని వైనం ధరణి ప్రభుత్వానికి మాయని మచ్చగా మారిన వైనం. సీఎస్ చుట్టే తిరుగుతున్న ధరణి […]
- క్యాడర్ కేటాయింపు వివాదంపై కీలక తీర్పు వెల్లడించిన హైకోర్టు
- కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు
- కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు
- ఏపీకీ కేటాయించినా.. తెలంగాణలోనే తిష్ట
- క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలు చేసినట్లు ప్రచారం
- పాత కేసుల విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటులో తాత్సారం
- ధరణి సమస్యలు చుట్టుముడుతున్నా పట్టింపు లేని వైనం
- ధరణి ప్రభుత్వానికి మాయని మచ్చగా మారిన వైనం.
- సీఎస్ చుట్టే తిరుగుతున్న ధరణి వైఫల్యాలు
- మంత్రులు, సీనియర్ అధికారులు చెప్పినా ధరణిపై ఏకపక్షంగా వ్యవహరించాడన్న విమర్శలు
- సీఎం కేసీఆర్ ఆదేశాలు ఖాతరు చేయలేదని.. గతంలోనే సోమేష్పై బదిలీ ప్రతిపాధనలు?
- ధరణి గుట్టు విప్పుతాడనే మళ్లీ కొనసాగించినట్లు ప్రచారం..?
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో హైకోర్టులో శృంగభంగం తప్పలేదు. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై మంగళవారం హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు, తెలంగాణలో సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం సోమేష్ కుమార్ను ఏపీకి కేటాయించింది. కానీ సోమేష్ కుమార్ కేంద్రం కేటాయింపును సవాల్ చేస్తూ.. క్యాట్ను ఆశ్రయించారు. దీంతో కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్ కు హైకోర్టులో భంగపాటు తప్పలేదు.
క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టి వేయాలని కోరుతూ 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తరువాత మంగళవారం క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్లడించిండంతో తెలంగాణ నుంచి సీఎస్కు తలాక్ అనివార్యంగా మారింది.
అయితే సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును సుమారు మూడు వారాల పాటు నిలిపివేసేందుకు హైకోర్టును కోరినా కోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు తీర్పును గౌరవించి సీఎస్ సోమేష్ కుమార్ను సీఎం కేసీఆర్ సాగనంపుతారా..? లేక తెలంగాణలో కొనసాగిస్తారా అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో షురూ అయ్యింది.
12లోగా ఏపీకి రిపోర్టు చేయండి.. CS సోమేశ్ను ఆదేశించిన కేంద్రం
సుప్రీం కోర్టుకు వెళ్లినా కష్టమే…
వాస్తవానికి సీఎం సోమేష్ కుమార్ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కొట్టివేసిన నేపథ్యంలో సోమేష్ కుమార్ ఈ ఉత్తర్వులపై అభ్యంతరం చెప్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చును. కానీ ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ లా ను ప్రశ్నించాలనుకుంటేనే సోమేష్ కుమార్ అంతటి సాహసం చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వపరిపాలన పరమైన అంశాలలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి.
వివాదాలు.. ఆరోపణలు
సీఎస్ సోమేష్ కుమార్ పై అనేక వివాదాలు, ఆరోపణలు ఉన్నాయని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్ హోదాలో ఉన్నసోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించాడని, ఇందులో భాగంగా రాష్ట్రంలో సీనియార్టీతో నిమిత్తం లేకుండా కొందరిని కీలక హోదాల్లో నియమించి తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారులను మాత్రం ప్రాధాన్యత లేని పోస్టులలో నియమించాడనే ఆరోపణలున్నాయి.
మాజీ సీజేఐతో మొట్టికాయలు…
గతేడాది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తీరుపై మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి. రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ఓ సదస్సులో అప్పటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీఎస్ తీరును అప్పటి సీజేఐకి వివరించారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, అయితే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ను ఆదేశించారని చెప్పినప్పటికీ.. నేటి వరకు సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే సీజేఐ దృ ష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీఎం మాట వినని సీఎస్గా పేరు…
రాష్ట్ర జ్యూడిషియల్ అథారిటీలో సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని భాగస్వామిగా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సదస్సులో సీజేఐకి సూచించారట. అయితే… మమతాబెనర్జీ ప్రతిపాదనపై స్పందించిన అప్పటి సీజేఐ ఎన్.వి.. రమణ.. 'తెలంగాణ ప్రధాన కార్యదర్శి తీరు మీరు విన్నారుగా అని ఎటకారంగా అన్నారని ప్రచారం జరిగింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశాలకు రారని, వచ్చినా నిర్ణయాలు అమలు చేయరని వ్యాఖ్యానించారట. దీంతో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినా… ఆ రాష్ట్ర సీఎస్ వినడా అనే చర్చ దేశ వ్యాప్తంగా సాగింది. ఈ విషయంలో సీఎస్పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ప్రచారం జరిగింది.
సోమేష్ గుప్పిట్లోనే భూ పరిపాలన…
సీఎస్గా ఉన్నసోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన వ్యవహారాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, సీసీఎల్ఏ కమిషనర్గా, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీలుగా అప్పట్లో శేషాద్రి, ఇప్పుడు రాహుల్ బొజ్జా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి పర్యవేక్షకుడిగా మాత్రం సీఎస్ సోమేష్ కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే ధరణిలో ఈ లోపాల సవరణకు సీఎస్ సోమేష్ కుమార్ అనుమతి తప్పనిసరి. కానీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణిలో సవరణల అంశాన్ని పక్కన పెట్టారనే అపవాదు ఉంది. దీంతో గత రెండున్నర సంవత్సరాల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇందులో భాగంగా కిందటేడాది మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే పలు దఫాలుగా సమావేశమై చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ధరణిలో పలు సవరణలు చేయాలని సూచించినప్పటికీ… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణిలో లోపాలను సరి చేయకపోగా, ప్రజల నుంచి వస్తున్నఆర్జీల పరిష్కారానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు.
వీఆర్ఏలపై చిన్నచూపు…
వీఆర్ఏలకు పే స్ట్కేల్ ఇస్తామని రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించడంతో పాటు కిందటేడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లోను స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ నేటి వరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ లేదు.
రెవెన్యూ విభాగం అధికారులు, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినా.. సోమేష్ కుమార్ అందుకు సంబంధించిన ఫైల్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సీఎస్ తొందరగా నిర్ణయం తీసుకోని కారణంగానే వీఆర్ ఏలు, వీఆర్ఓలు ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
నచ్చిన వారికే అందలం …
ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్య విభాగాలలో సీఎస్ సోమేష్ కుమార్ తన అనునాయులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ఉంది.
ఎమ్మెల్యేలనే ఖాతర్ చేయడట…
సీఎస్ సోమేష్ కుమార్ ప్రజల ఇబ్బందులపై చర్చించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడనే ఆరోపణ ఉంది. సోమేష్ కుమార్ కు సీఎం అండ ఉందనే కారణంతో ఆయనతో గట్టిగా మాట్లాడేందుకు అధికార పార్టీ మంత్రులు కూడా సాహసం చేయలేని స్థితి. ఈ క్రమంలోనే సీఎస్ సోమేష్ కుమార్ తనకు ఎదురే లేదు అన్నట్లుగా ప్రవర్తించాడనే అపవాదు ఉన్నది.
టీఆర్ఎస్ కొంప ముంచిన రూ.10వేలు…
జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు రూ.10వేలు ఇవ్వాలనే ప్రతిపాదన సోమేష్ చేసిందేనని ఐఏఎస్ వర్గాల్లో చర్చ. ప్రతి వరద బాధితుడి కుటుంబానికి రూ.10వేలు ఇవ్వడం వలన టీఆర్ ఎస్కు ఎన్నికలలో మేలు జరుగుతుందని సలహా ఇచ్చింది కూడా ఆయనే అని నేటికి చాలా మంది అంటుంటారు.
కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్ కొంప ముంచింది ఆ రూ.10వేల పంచాయితీలేనని జీహెచ్ఎంసీ ఫలితాల తరువాత సాక్షాత్తు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
గతంలోనే సాగనంపాలనే ప్రతిపాదనలు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సాగనంపాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ధరణి పై రాష్ట్ర భూపరిపాలన గుట్టు విప్పుతాడనే సోమేష్కుమార్ను అప్పట్లో బయటకు పంపలేదనే ప్రచారం జరిగినప్పటికీ.. రెండు మూడు రోజుల హైడ్రామా తరువాత కేసీఆర్ మళ్లీ సోమేష్ కుమార్నే సీఎస్గా కొనసాగిస్తూ వచ్చారు. ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితులలో కొత్త సీఎస్ నియామకం అనివార్యం అనే ప్రచారం జరుగుతున్నది.