Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని అరెస్టు చేసింది. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆయనను.. జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను దర్యాప్తు సంస్థ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా.. మార్చి 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సిసోడియాను పోలీసు రక్షణలో తీహార్ జైలుకు తరలించారు.
భగవత్ గీత, డైరీ, పెన్ను వెంట ఉంచుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మెడికల్ రిపోర్టుల ఆధారంగా మందులు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు ఇదే కేసులో వ్యాపారవేత్త బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమన్దీప్ ధాల్ను సైతం అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ఆయనను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. సౌత్ గ్రూప్లో ఎమ్మెల్సీ కవితి ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. రెండు రోజులుగా పిళ్లైని విచారిస్తున్న ఈడీ.. ఆయననను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆధారాలతో జనవరి 25న ఆరుణ్ పిళ్లై ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం విధితమే. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలోని రూ.2.25కోట్ల విలువ చేసే భూమిని అటాచ్ చేసింది. సౌత్ గ్రూప్లో ఇండో స్పిరిట్ ఎండీ సమీర్మహేంద్రు, ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారని, కవిత తరఫున అరుణ్ పిళ్లై సమావేశాల్లో పాల్గొన్నట్లు ఈడీ చార్జిషీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ మార్పు ద్వారా వచ్చిన ఎల్-1 లైసెన్సుల్లో 65శాతం సౌత్గ్రూప్ కంట్రోల్లోకి వెళ్లింది. ఈ కేసులో అభిషేక్రావు, అరుణ్రామచంద్ర పిళ్లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవరెడ్డి పాటు ఎమ్మెల్సీ కవితపై ఈడీ తీవ్రమైన అభియోగాలు మోపింది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది అరెస్టయ్యారు. ఇందులో పలువురు బెయిల్పై విడుదలయ్యారు.