Dharani | రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు.. ట్రిబ్యునళ్లతో సాధించిందేంటి? ధరణిలో సమస్యలు.. సవాలక్ష యంత్రాగానికే అవగాహన లేదు.. కొన్ని సమస్యలు యథాతథంగానే ధరణి పోర్టల్‌తో కొత్త ఇబ్బందులు వివరాల్లో తప్పులతో విక్రయానికీ వీల్లేదు పరిష్కారాల్లేని పార్ట్‌ బీ సమస్యలు గతంలో భూ రికార్డుల, భూ సరిహద్దులు, ఇతర ఏ విధమైన వివాదం వచ్చినా మండల, డివిజన్, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఉండేవి. ఏదో ఒక కోర్టులో రైతుకు న్యాయం జరిగేది. రాష్ట్రంలో రెవెన్యూ […]

Dharani |

  • రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు..
  • ట్రిబ్యునళ్లతో సాధించిందేంటి?
  • ధరణిలో సమస్యలు.. సవాలక్ష
  • యంత్రాగానికే అవగాహన లేదు..
  • కొన్ని సమస్యలు యథాతథంగానే
  • ధరణి పోర్టల్‌తో కొత్త ఇబ్బందులు
  • వివరాల్లో తప్పులతో విక్రయానికీ వీల్లేదు
  • పరిష్కారాల్లేని పార్ట్‌ బీ సమస్యలు

గతంలో భూ రికార్డుల, భూ సరిహద్దులు, ఇతర ఏ విధమైన వివాదం వచ్చినా మండల, డివిజన్, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఉండేవి. ఏదో ఒక కోర్టులో రైతుకు న్యాయం జరిగేది. రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను తెలంగాణ సర్కార్ రద్దుతో రైతుకు న్యాయం దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఏ చిన్న వివాదం వచ్చినా సివిల్ కోర్టులకు పోవాల్సి వస్తున్నది. దీంతో దూరాభారంతో పాటు ఖర్చు భారీగా పెరిగిపోయింద‌ని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులను ట్రిబ్యునళ్లకు అప్ప‌గించి, ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ట్రిబ్యునళ్లు సివిల్ కోర్టులకే పొమ్మంటూ ఉచిత సలహాలను ఇస్తుండటంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా కేంద్రంలో శాశ్వత రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్ర‌భుత్వం.. త‌ర్వాత విస్మ‌రించింది. - బూడిద సుధాకర్‌, విధాత హైదరాబాద్‌ ప్రతినిధి

రాష్ట్రంలో భూ సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను పెడతామని గ‌తంలో అప్ప‌టి సీఎస్ ప్ర‌క‌టించారు. కానీ వెంటనే వెనక్కి తగ్గి, మళ్లీ తేదీలను ప్రకటిస్తామన్నారు. నెల‌లు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ సదస్సుల మాటే ఎత్తడం లేదు. ధరణిలో దొర్లిన తప్పులతోనే రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్ విషయంలో ముఖ్యమంత్రి చెప్పే మాటలకు, జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది.

కొన్ని అంశాలను పరిశీలిస్తే..

కేసీఆర్ మాట..

ధరణి పోర్టల్ రాక ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, ప్లాట్లు, కేటాయించాలి.

జరుగుతున్నది

ధరణి రాకకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్ల మీదకు రికార్డులు ఇంకా మారలేదు. పాత యాజమానుల పేర్లే ధరణిలో ఉండటంతో కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. తమ పేరు మీదకు మార్చాలని దరఖాస్తు పెట్టుకుంటే కొన్ని పెండింగ్‌లో ఉంటున్నాయి. మరికొన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. అందుకు కారణం పాత పట్టడారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలే కారణం.

కేసీఆర్ మాట..

సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి.

జరుగుతున్నది

అసలు సాదా బైనామాల ముచ్చటనే పట్టించుకోవడం లేదు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఊసే లేదు.

కేసీఆర్ మాట

కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్-బీలో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయి లో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి.

జరుగుతున్నది

వేల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను పరిష్కరించే సమయం కలెక్టర్లకు లేదు. డాష్ బోర్డును ఖాళీ చేసుకునే ఉద్దేశంతో.. కారణం చెప్పకుండానే దరఖాస్తులు తిరస్కరించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ మాట

కొన్ని చోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమి? ఏది ప్రైవేటు భూమి? అనేది నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి.

జరుగుతున్నది

నిషేధిత భూముల జాబితాలకు పట్టా భూములు చేరాయనే ఫిర్యాదులు వేల సంఖ్యలో వస్తున్నాయి. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా వీటిని పరిష్కరించడం లేదు.

కేసీఆర్ మాట

అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.

జరుగుతున్నది

ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్‌మెంట్‌ భూములు ఇప్పుడు ప్రభుత్వ భూములుగా చూపిస్తోంది. తమ పేర్ల మీదకు మార్చాలని చేసుకుంటున్న దరఖాస్తులు వృథానే తప్ప పరిష్కారం కావడం లేదు.

కేసీఆర్ మాట

ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.

జరుగుతున్నది

ధరణి వచ్చిన తర్వాత అసలు ఇనామ్ భూముల గురించి ప్రభుత్వం ఆలోచించిన పాపాన పోలేదు.

సమస్యలు సవాలక్ష

  • ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి ఇప్పటికీ రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిస్థాయి అవగాహన లేదు. వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండానే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవడంతో ధరణిలో సమస్యలు వస్తే ఎవరిని అడగాలో రెవెన్యూ అధికారులకు సైతం తెలియని పరిస్థితి ఏర్పడింది.
  • సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీకరణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. వంటి సమస్యలను రైతులు ప్రధానంగా ధరణి పోర్టల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • భూముల లావాదేవీల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తీసుకువచ్చింది. కానీ, పోర్టల్ ద్వారా కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. తాతల కాలం నుంచీ అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల వివరాలు కూడా: మారిపోవడం, వేరేవారి పేర్ల మీద నమోదు కావడం, అసలు జాడే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
  • రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్లలోనే ఉండిపోతున్నాయి. దీంతో తప్పుల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి అలా పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి.
  • ధరణి రికార్డుల్లో వివరాలు తప్పుడు వచ్చిన రైతులు అత్యవసరానికి భూమిని అమ్ముకోవాలనుకున్నా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి.
  • పాసుబుక్కులో చనిపోయిన వారి పేర్లు ఉండడం, ఆధార్ తప్పుగా నమోదు, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పు చేయడం, అటవీశాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం వంటి తప్పులు కూడా చాలా ఉన్నాయి.
  • 2017లో చేసిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో తగాదా భూములను, కోర్టు కేసులలో ఉన్నవాటిని పార్టు - బీలో చేర్చారు. నేటికి ఆ సమస్యలను పరిష్కరించడం లేదు. ఆ రైతులకు ఎలాంటి హక్కులను కల్పించడం లేదు.
  • రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 'రిజిస్ట్రేషన్ నిషేధ భూముల జాబిత సెక్షన్ - 22ఎ పేరుతో' పెట్టారు.. భూమిలో కొంత భాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ జాబితాలో పెట్టారు. ఇది ఎంత వరకు కరెక్ట్. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో పెట్టడం జరిగింది. ఎలాంటి తగాదా లేని భూములు కూడా నిషేధ జాబితాలోకి వెళ్లాయి. దీంతో భూమి ఉన్నప్పటికీ అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది.
  • ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయాలి. కానీ ధరణిలో సెక్షన్‌ 26 సవరణతో ఆ బాధ్యత నుండి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తప్పుకొని భూయజమానిపై పెట్టాయి.
  • ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదులకు (గ్రీవెన్సులు) కలెక్టర్లే పరిష్కారం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఇవి వేగంగా పరిష్కారం కావడం లేదు.
  • రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం - 1971 ప్రకారం మ్యుటేషన్‌పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా జాప్యం జరుగుతున్నది.
  • ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
  • సాదా బైనామాలకు సంబంధించి భూయజమానులకు క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు నేటికి ఇవ్వలేదు. క్రమబద్ధీకరణకు మొదట 15.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెండో విడతలో మరో 9 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో కేవలం 6.18 లక్షలను క్లియర్ చేసినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. మిగిలిన 18.50 లక్షల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. దీనికి కోర్టు పేరు తో కాలయాపన చేస్తున్నారు.
Updated On 5 Jun 2023 2:12 PM GMT
krs

krs

Next Story