- 30 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ
- మోడీ, అమిత్షా ప్రచారం చేసిన
- సగానికి పైగా మంత్రులకూ తప్పని ఓటమి
విధాత : బీజేపీ మీద కర్ణాటక (BJP Karnataka ) ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఎన్నికలకు ముందే వార్తలు వచ్చినా.. అది ఇంత స్థాయిలో ఉంటుందని కనీసం బీజేపీ వాళ్లు కూడా ఊహించి ఉండలేదేమో! లేకపోతే.. ఏకంగా 13 మంది మంత్రులు ఓడిపోవడం ఏమిటి? 30 స్థానాల్లో అవమానకరంగా డిపాజిట్లు కూడా దక్కకపోవడమేంటి?
తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రచారం నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తోపాటు.. వీ సోమన్న, బీఎస్ శ్రీరాములు, మధుస్వామి, గోవింద కరజోల్, ఎంటీబీ నాగరాజ్, బీసీ పాటిల్, మురుగేశ్ నిరాని, కేసీ నారాయణ గౌడ, బీసీ నగేశ్, శంకర్పాటిల్ సహా 13 మంది ఓటమి చవిచూడక తప్పలేదు.
సాధారణంగా మంత్రులు అంటే తమ తమ నియోజకవర్గాలను ఎంతో కొంత అభివృద్ధి చేసుకుంటారు. వారి నియోజకవర్గాలు వారి ఇలాకాలుగా కూడా పిలుస్తుంటారు. కానీ.. మంత్రులు సైతం ఓడిపోవడం ఆ పార్టీకి అవమానకరంగా పరిణమించింది.
30 చోట్ల డిపాజిట్లు హుష్కాకి
బీజేపీ 65 స్థానాలు గెలిస్తే.. 30 చోట్ల డిపాజిట్లు కోల్పోవడం బీజేపీకి చెంపపెట్టులాంటిదే. బీజేపీ నేతల అవినీతి బాగోతాలు, ఆ పార్టీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టించడం వల్లే ఈ స్థాయిలో బీజేపీ పరాజయాన్ని చవిచూసిందనడంలో సందేహం లేదు.