విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాల సెగలు క్రమంగా ఒక్కో మున్సిపాలిటీకి విస్తరిస్తున్నాయి. నందికొండ, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో మొదలైన అవిశ్వాస ప్రతిపాదనల అసమ్మతి సోమవారం సాయంత్రం కల్లా చండూరు మున్సిపాలిటీని తాకింది.
చండూరు మున్సిపాలిటీ చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు చెందిన ప్రస్తుత చైర్ పర్సన్ తోకల చంద్రకళ, వైస్ ఛైర్మన్ దోటి సుజాతలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి నోటీస్ అందజేశారు. పదిమంది కౌన్సిలర్ల సంఖ్య ఉన్న ఈ మున్సిపాలిటీలో అసమ్మతి వర్గానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు , ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రస్తుత చైర్మన్పై అవిశ్వాసాన్ని కోరుతున్నారు.
అధికార పార్టీ చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యం మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు విజయం సాధించారు.
పార్టీల మార్పుతో మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్కు ఒకరు, బీజేపీకి ముగ్గురు, బీఆర్ఎస్ కు ఆరుగురు కౌన్సిలర్ల బలం ఉంది. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన వారిలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుండి ఇద్దరు ,కాంగ్రెస్ నుంచి ఒకరు ఉన్నారు. మరో బీజేపీ సభ్యుడు సైతం అవిశ్వాసానికి మద్దతు పలికే అవకాశం ఉంది.
కాగా మున్సిపాలిటీ లలో అవిశ్వాస తీర్మానాలపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
కావాల్సిన సంఖ్య మా పార్టీకే ఉందని, అవిశ్వాసం అనేది మా అంతర్గత సమస్య అని రెండున్నరేండ్లు ఒకరు.. మరో రెండున్నరేండ్లు ఒకరని గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అవిశ్వాస సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అవిశ్వాసంపై బీజేపీ రాజకీయం అవసరం లేదన్నారు.