కాంగ్రెస్ కార్యకర్తల ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం
విపక్షం గొంతునొక్కిన ప్రభుత్వం: ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎమ్మెల్యే సీతక్క, నాయిని ఆగ్రహం నిధుల జాప్యంతోనే ఆత్మహత్యలని పలువురి ఆరోపణ సమస్యల్లో సర్పంచులు పరకాలలో సీఎం దిష్టిబొమ్మ దహనం విధాత, వరంగల్: టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతే కాకుండా సోమవారం తెల్లవారు జాము నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు […]
- విపక్షం గొంతునొక్కిన ప్రభుత్వం: ఎమ్మెల్యే సీతక్క
- ములుగు ఎమ్మెల్యే సీతక్క, నాయిని ఆగ్రహం
- నిధుల జాప్యంతోనే ఆత్మహత్యలని పలువురి ఆరోపణ
- సమస్యల్లో సర్పంచులు
- పరకాలలో సీఎం దిష్టిబొమ్మ దహనం
విధాత, వరంగల్: టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతే కాకుండా సోమవారం తెల్లవారు జాము నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి అందరిని గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో ముందస్తు అరెస్టు
సర్పంచులకు మద్దతుగా సోమవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిప్ప వెంకటేశ్వర్లు నేత ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్తారని భావించి పోలీసులు ముందుగా అరెస్టు చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ప్రభుత్వ వైఫల్యం పై స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు విడుదలలో జాప్యం చేయడంతో ఆత్మహత్యలకు కారణం అయ్యిందని ఆరోపించారు. 18 మంది సర్పంచ్లు రాజీనామాకీ ప్రభుత్వమే కారణమన్నారు. అరెస్టైన వారిలో టీపీసీసీ వరంగల్ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ దొంతుల రాజేష్ నేత, డివిజన్ ప్రెసిడెంట్ దామెర రాజ్ కమల్, పార్టీ సీనియర్ లీడర్ గొండ శ్రీను, డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు Sk హైదర్ తదితరులున్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ పరకాల నియోజకవర్గం నర్సక్కపల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఆత్మకూర్ మండల్ ప్రెసిడెంట్ రమేష్, కొయ్యడం శ్రీనివాస్, పీసీసీ మెంబర్ అశోక్, వరంగల్ జిల్లా రైతు సమాఖ్య బాంపల్లి దేవేందర్ రావు, దామెర మండల్ అధ్యక్షులు మన్నే ప్రకాష్ రెడ్డి, రాపర్తి ఎంపీటీసీ పర్నెం శ్రీలత మల్లారెడ్డి, చెర్లపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి, నాగారం సర్పంచ్ కట్కూరి స్రవంతి దేవేందర్ రెడ్డి, నర్సక్కపల్లి ఎంపీటీసీ బుర్ర దీప దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గొంతునొక్కిన ప్రభుత్వం: సీతక్క
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తే అణగతొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు పేరుతో అక్రమంగా నిర్బందిస్తున్నారని ఆరోపించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ములుగు నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలన్నారు. సర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లకు ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.