ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన ఈడీ 20న విచారణకు రావాలని కవితకు తాజా సమన్లు ప్రత్యేక కోర్టులో రామచంద్రపిళ్లై హాజరు కవిత విచారణకు రాలేదని వెల్లడించిన అధికారులు పిళ్లైతో కలిపి విచారించాల్సి ఉన్నదని వెల్లడి కస్టడీ పొడిగించాలని ఈడీ వినతి.. ఆమోదం 18 హాజరుకావాలని మాగుంటకు ఈడీ నోటీసులు విధాత : ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుట్ల కవిత (BRA MLC Kavitha) అనుమానితురాలని ఈడీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే […]
- ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన ఈడీ
- 20న విచారణకు రావాలని కవితకు తాజా సమన్లు
- ప్రత్యేక కోర్టులో రామచంద్రపిళ్లై హాజరు
- కవిత విచారణకు రాలేదని వెల్లడించిన అధికారులు
- పిళ్లైతో కలిపి విచారించాల్సి ఉన్నదని వెల్లడి
- కస్టడీ పొడిగించాలని ఈడీ వినతి.. ఆమోదం
- 18 హాజరుకావాలని మాగుంటకు ఈడీ నోటీసులు
విధాత : ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుట్ల కవిత (BRA MLC Kavitha) అనుమానితురాలని ఈడీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిపి ఆమెను విచారించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. వాస్తవానికి గురువారం కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. సుప్రీం కోర్టులో కేసు 24 వ తేదీకి పెండింగ్లో ఉన్నదున ఆ తర్వాత ఒక రోజు నిర్ణయించాలి కోరారు. అయితే.. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ అధికారులు ఈ నెల 20 హాజరుకావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. సుప్రీం కోర్టు కేసును చూపిస్తూ విచారణకు హాజరుకాని కవిత.. ఈ అంశం అలా ఉండగానే చెప్పిన తేదీకి హాజరవుతారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.
పిళ్లై కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో గురువారం విచారణకు రావాల్సిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRA MLC Kavitha) హాజరు కాలేదని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. కవితను, పిళ్లైను ముఖాముఖి కూర్చొనపెట్టి విచారించాల్సి ఉన్నందున పిళ్లై కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరగా, కోర్టు మాత్రం మూడు రోజులు కస్టడీని పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మరో మూడు రోజులపాటు పిళ్లై ఈడీ కస్టడీలో ఉంటారు. అదే సమయంలో అందరినీ కలిపి ఒకేసారి ఎందుకు విచారించాలని ప్రత్యేక న్యాయస్థానం ఈడీ అధికారులను ప్రశ్నించింది. డాక్యుమెంట్ల ద్వారా కూడా ప్రశ్నించవచ్చు కదా అని సందేహం వ్యక్తం చేసింది.
మాగుంటకు ఈడీ నోటీసులు
మరోవైపు ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (YCP MP Magunta Srinivasulureddy)కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 18న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన కుమారుడు రాఘవ ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్నారు.
సుప్రీం ఆదేశాలు పాటిస్తే విచారణకు సహకరిస్తాం: భరత్
అంతకు ముందు ఈడీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు, కవిత తరఫు న్యాయవాది సోమా భరత్కుమార్.. కవితను ఈడీ వేధిస్తున్నదని ఆరోపించారు. ఏ రకమైన ఆధారాలు లేకుండా అనేక కేసుల్లో ఇరికించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సాక్షిగా కాని, నిందితుడిగా గాని మహిళను ఇంటివద్దే విచారించాలి. అలాగే ఆరు గంటలలోపే విచారించాలన్నారు. ఇవి ప్రాథమిక హక్కులని పేర్కొన్నారు. ఈ హక్కులను ఉల్లంఘించి ఈడీ అధికారులు ఈ నెల 11న రాత్రి 8.30 గంటల వరకు కవితను ఉంచారు. చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ధిక్కరించింది. ఇదే కాదు ఆమె మొబైల్ను అన్యాయంగా, చట్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకున్నారు.
అనారోగ్యం కారణంతో కవిత విచారణకు హాజరుకాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారిస్తే కవిత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తదుపరి విచారణకు సంబంధించిన నోటీసులు గాని, మళ్లీ ఎప్పుడు రావాలని ఈడీ చెప్పలేదన్నారు.
మాకు ఈడీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, మేము ఇచ్చిన పేపర్లు మాత్రమే తీసుకున్నది. చట్టప్రకారం ఆమెను ఇంటి వద్దనే విచారించాలని అది హక్కు అని భరత్ స్పష్టం చేశారు. ఆ హక్కు సాధించుకోవడానికి తాము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని ఈ నెల 24న విచారణ ఉన్నదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామన్నారు.