కోమాలో ఉన్నాడని.. మృతదేహాన్ని18 నెలలు ఇంట్లోనే ఉంచారు..
విధాత : ఓ 35 ఏండ్ల వ్యక్తి ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అయితే అతను కోమాలోనే ఉన్నాడని భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. అతనిపై ప్రతి రోజు గంగా జలం చల్లి, కోమా నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రావత్పురాకు చెందిన విమలేష్ దీక్షిత్(35) ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగి. ఆయన భార్య మిథాలీ కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేస్తోంది. అయితే […]
విధాత : ఓ 35 ఏండ్ల వ్యక్తి ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అయితే అతను కోమాలోనే ఉన్నాడని భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. అతనిపై ప్రతి రోజు గంగా జలం చల్లి, కోమా నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రావత్పురాకు చెందిన విమలేష్ దీక్షిత్(35) ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగి. ఆయన భార్య మిథాలీ కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేస్తోంది. అయితే 18 నెలల క్రితం విమలేష్ అనారోగ్యానికి గురి కావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. 2021, ఏప్రిల్ 22న ఆకస్మాత్తుగా చనిపోయాడు. కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కారణంగా విమలేష్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇక విమలేష్ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే అతని గుండె కొట్టుకుంటుందని తల్లి భావించింది. తన కుమారుడు కోమాలోనే ఉన్నాడని భావించిన తల్లి.. అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆ రోజు నుంచి ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచుకున్నారు. ప్రతి రోజు అతనిపై గంగా జల్లి, కోమా నుంచి తిరిగి రావాలని ప్రార్థించడం మొదలుపెట్టింది తల్లి. తమ కుమారుడు కోమాలోనే ఉన్నాడని చెప్పి, ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. ఇంటికి ఎవర్నీ రానివ్వలేదు.
అయితే ప్రయివేటు ఆస్పత్రి జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని, భార్య మిథాలీ తన భర్త పెన్షన్ కోసం దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. అధికారులు అప్రమత్తమై రావత్పురాలోని విమలేష్ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి, కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని రహస్యంగా ఉంచిన ఆ కుటుంబ సభ్యులపై ఇరుగుపొరుగు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.