Arepalli Mohan | విధాత బ్యూరో, కరీంనగర్: మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార పార్టీ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ […]

Arepalli Mohan |

విధాత బ్యూరో, కరీంనగర్: మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార పార్టీ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, అప్పటి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థన మేరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ సహకారం అవుతుందని భావించానని చెప్పారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో బీసీలు, దళితులకు పూర్తిగా న్యాయం జరగలేదని విమర్శించారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడాలనే తపనతోప్రజల గొంతుకగా మారాలనే ఉద్దేశంతో, అధికార పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

సుదీర్ఘ ప్రస్థానం

ఆరేపల్లి మోహన్ విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్ యూఐ నాయకునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మానకొండూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా 19 ఏళ్లపాటు పనిచేశారు. అనంతరం తిమ్మాపూర్ జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికైన ఆయన, జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. జడ్పీ చైర్మన్ గా రెండేళ్ళు పనిచేసిన అనంతరం, 2019లో మానకొండూరు శాసనసభ్యులుగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ప్రభుత్వంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు.

మాతృ సంస్థలోకే..

అధికార బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరెపల్లి మోహన్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ్యులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తొలుత అధికార పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయం మాట్లాడుకోవాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు.

15 రోజుల క్రితమే..

అధికార పార్టీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు. మానకొండూర్ నియోజకవర్గానికి సంబంధించి తన మిత్రులు, శ్రేయోభిలాషులతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం 15 రోజుల క్రితం అధికార పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్… ఆరేపల్లి మోహన్ కు ఫోన్ చేసి ఆయనను బుజ్జగించారు. దీంతో తాత్కాలికంగా రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న ఆయన, బీఆర్ఎస్ లో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని భావించి, తిరిగి మాతృ సంస్థలోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.

Updated On 15 Sep 2023 12:07 AM GMT
krs

krs

Next Story