- లక్ష్యసాధనకు విద్యార్థులు నిరంతరం శ్రమించాలి
- పేద విద్యార్థులకు అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు
- జడ్పీటీసీ సభ్యురాలు శారద
విధాత: విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందడంతో పాటు భవిష్యత్కు పునాదులు ఏర్పాటు చేసుకోవచ్చని రామగిరి జడ్పీటీసీ మ్యాదరవేని శారద అన్నారు. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు ఆమె ప్రారంభించారు. విద్యార్థి దశలోనే తమ లక్ష్యాలను ఎంచుకోవడంతో పాటు ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు నిలుస్తోందన్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారి ఆకలి తీర్చుతోందన్నారు. పేద విద్యార్థులను ప్రయోజకులుగా చూడాలన్నదే జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆలోచన అని, ఆ ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక నిపుణులతో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు.
నియోజవర్గంలోని పేద విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా గొప్పగా ఆలోచన చేస్తూ ఆచరణలో పెడుతున్నారని ఆమె కొనియాడారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివి ఇటు కన్నవారి కలలు, అటు ప్రోత్సాహం అందించే వారి ఆశయాలను నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక నిపుణుడు శ్రావణ్ పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మ్యాదరవేని కుమార్ యాదవ్, నాయకులు కాపురబోయిన భాస్కర్, బుర్ర శంకర్, మారగోని కుమారస్వామి, ఎస్ఎంసీ చైర్మన్ కట్ట శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.