విధాత, హైదరాబాద్ : తొమ్మిది, పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చింది. ఒక్కో సబ్జెక్ట్లో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు కేటాయించింది. సామాన్యశాస్త్రంలో పేపర్లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం సగం చొప్పున మార్కులు కేటాయించింది.
ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పది వార్షిక పరీక్షలను 11 నుంచి ఆరు పేపర్లకు కుదించిన విషయం విధితమే. తాజాగా ఇకపై నుంచి పదో తరగతితో పాటు తొమ్మిది పరీక్షలను సైతం ఆరేసి పేపర్లు నిర్వహించేందుకు నిర్ణయించింది.
గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా, కేవలం హిందీ సబ్జెక్ట్కు ఒకే పరీక్ష నిర్వహించే వారు. ఇకపై అన్ని సబ్జెక్టులకు ఒకే పరీక్ష నిర్వహించనున్నది.