Gyanvapi Mosque
- 7 కేసులను కలిపి విచారించనున్న ధర్మాసనం
విధాత: జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque) కేసులో మొత్తం ఏడు కేసులను కలిపి విచారిస్తామని వారణాసి జిల్లా కోర్టు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా జడ్జి సోమవారం రిజర్వ్ చేసిన తన తీర్పును మంగళవారం వెలువరించారు. తీర్పు నేపథ్యంలో ఈ విషయంలో ఏడు కేసులు కలిపి విచారిస్తారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శ్రింగార్ గౌరి ప్రాంతంలో రోజు వారీ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ 2021 ఆగస్టులో ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. మసీదు పరిసరాల్లో సర్వే చేయాలని 2022 ఏప్రిల్లో సీనియర్ డివిజన్ కోర్టు ఆదేశించింది.
అదే ఏడాది మే నెలలో సర్వే పూర్తి చేశారు. ఆ సమయంలో ఒక శివలింగం (Shivling) కనుగొన్నట్టు చెబుతున్నారు. అయితే.. ఈ కేసులో ముస్లింలు మాత్రం అది ఫౌంటెన్ అని చెబుతున్నారు. దీని కాలాన్ని నిర్థారించేందుకు కార్బన్ డేటింగ్ చేయాల్సి ఉన్నా.. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు కార్బన్ డేటింగ్ నిర్వహించవద్దని సుప్రీం కోర్టు (Supreme Court) మే 19న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను (Archeological Survey of India) ఆదేశించింది.
మే 16న హిందువుల పక్షాన న్యాయవాది విష్ణుశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ పిటిషన్లో సమాధానం ఇవ్వాలని జ్ఞానవాపి మసీదు కమిటీని కోర్టు అడిగింది. దీనిపై విచారణ ఆగస్టు 7న నిర్వహించనున్నారు.