Heavy Rains | విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు భారీ వర్షాలపై మంత్రి తలసాని సమీక్ష రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వాన దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ […]

Heavy Rains |
- విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు
- భారీ వర్షాలపై మంత్రి తలసాని సమీక్ష
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వాన దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు 3 రోజులు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని జనాలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
లింగంపల్లి అండర్పాస్ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో బస్తీల్లోకి మురికి నీరు చేరుతుంది. బస్తీల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ సూచించారు.
మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు మియాపూర్లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 14.3 సెం.మీ., శివరాంపల్లిలో 13 సెం.మీ., గాజులరామారంలో 12.5 సెం.మీ., బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్లో 12, కుత్బుల్లాపూర్లో 11.5, మాదాపూర్లో 11.4, సికింద్రాబాద్, రాజేంద్రనగర్లో 11.2, బేగంపేట్, కేపీహెచ్బీ, అల్వాల్, శేరిలింగంపల్లిలో 10, ముషీరాబాద్లో 9.9, గోషామహల్లో 9.5, మలక్పేటలో 9.4, ఫలక్నూమాలో 9.2, కార్వాన్లో 8.8., సరూర్నగర్లో 7.9, ఎల్బీనగర్, అంబర్పేటలో 6.6, మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో విద్యాసంస్థలకు మంగళ, బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గితే మళ్లీ సమీక్షించి సెలవులపై పునారాలోచన చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార యంత్రాంగంతో వరదలపై సమీక్ష నిర్వహించారు.
నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడిఎం డైరెక్టర్, హైద్రాబాద్ కలెక్టర్ తో మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని సూచించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని, మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.
