- కేసునమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- గతంలోనూ విద్యార్థనిపై వేధింపులు
- దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు
- అయినా తీరు మారని ఉపాధ్యాయుడు
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయవలసిన ఉపాధ్యాయుడే తోటి ఉపాధ్యాయురాలి పై లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం.. గతంలో కూడా విద్యార్థినిని వేధించడంతో దేహశుద్ది, మరో పాఠశాలకు బదిలీ చేశారు.
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడిగా యాదగిరి విధులు నిర్వహిస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడు యాదగిరి తోటి ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు శంకరంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడు యాదగిరి గతంలో నార్సింగ్ పాఠశాలలో విద్యార్థినిని వేధించిన ఘటనలో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు దేహశుద్ది చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో అధికారులు అతడిని సూరారం ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో మండలంలోని సూరారం జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు.
అయినా తీరుమారని సదరు ఉపాధ్యాయుడు ఆ ఘటన మరువకముందే పాఠశాలలోని తోటి ఉపాధ్యాయురాలి పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాదగిరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.