IPL-2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023కి కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 31న మెగా టోర్నీ ప్రారంభంకానున్నది. టోర్నీ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులను అలరించనున్నది. అయితే, ఈ సారి ఐపీఎల్లో కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. దాంతో ఆట మరింత ఉత్సాహభరితంగా సాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రవేశపెట్టనున్నది. అదే సమయంలో టీమ్స్ రివ్యూను సైతం పెంచింది. వైడ్, నోబాల్లకు కూడా రివ్యూలు తీసుకునే అవకాశం ఇవ్వనున్నది. ఈ రెండు నిబంధనలతో కొత్తగా మరో నాలుగు నిబంధనలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2023 సీజన్లో ఇరు జట్లు టాస్ వేసిన తర్వాత.. ఆయా జట్లు తమ తుది జట్లను ప్రకటించేలా కొత్త రూల్ తీసుకువచ్చారు.
ఈ నిబంధనతో టాస్ నిర్ణయాన్ని బట్టి తుది జట్టును.. ఇంపాక్ట్ ప్లేయర్ను ఆయా జట్లు ఎంపిక చేసుకునే అవకాశం కలగనున్నది. ఈ నిబంధనను ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో అమలు చేస్తున్నారు. కొత్తగా ఐపీఎల్లోనూ అమలు చేయబోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకునేదాన్ని బట్టి తుది జట్టును ఎంచుకునే వెసులుబాటు కలుగనున్నది. స్పిన్కు అనుకూలమైన పిచ్పై బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవాలనుకునే జట్టు ముందుగా బౌలింగ్ చేయాల్సి వస్తే.. అలాంటి పరిస్థితుల్లో ఏ జట్టయినా అదనపు స్పిన్నర్ను తుది 11 మందిలో ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు ఇరుజట్లు టాస్ ముందే తమ జట్లను ప్రకటించేవి.
ఈ టాస్ రూల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్న స్లో ఓవరేట్ పెనాల్టీ రూల్ను సైతం అమలులోకి తీసుకురానున్నారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే.. సర్కిల్ బయటన నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తున్న విషయం విధితమే. ఎన్ని ఓవర్లు తక్కువైతే.. అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ రూల్ అమలవుతున్నది. దీన్ని ఐపీఎల్లో కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. వికెట్ కీపర్, ఫీల్డర్ అనైతిక చర్యకు ఐదు పరుగులు పెనాల్టీగా విధించడంతో పాటు ఆ బంతిని డెడ్బాల్గా పరిగణించనున్నారు. ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ దృష్టి మరల్చేందుకు ప్రయత్నించినా.. ఇబ్బందిపెట్టినా అనైతిక చర్యగా భావించిన ఈ పెనాల్టీ విధించనున్నారు.