విధాత: సైన్స్ అంతా వేదం నుంచే వచ్చిందని ఇస్రో (ISRO) అధిపతి ఎస్.సోమనాథ్ (S. Somanath) అన్నారు. బీజగణితం, వర్గమూలాలు, కాల గణన, ఆర్కిటెక్చర్, మెటల్లర్జీ, విమాన శాస్త్రం మొదలైనవాటిని తొలుత వేదాల్లోనే కనుగొన్నారని వ్యాఖ్యానించారు. ఉజ్జయినిలోని మహర్షి పాణిని సంస్కృతం, వేదిక్ విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
‘వేదాలలోని సారమంతా అరబ్బు దేశాల ద్వారా యూరప్కి వెళ్లిపోయింది. కాలక్రమంలో అవన్నీ అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాల్లా మారిపోయాయి’ అని సోమనాథ్ అన్నారు. ‘ వేదకాలం శాస్త్రవేత్తలు విషయాలను లిఖించలేదు. సంస్కృత భాషలో ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో మాత్రమే బదిలీ జరిగేది. అందుకే ఈ సమస్య వచ్చింది’ అన్నారు. అంతే కాకుండా కృత్రిమ మేధకు సంస్కృతం సరిగ్గా సరిపోతుందని సోమనాథ్ అభిప్రాయపడ్డారు.