JPS problems
విధాత: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(Junior Panchayat Secretaries)(JPS) సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం రంగారెడ్డి, సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముగిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామ పంచాయతీలలో జేపీఎస్ లు పనిచేస్తున్నారని నోటిఫికేషన్ ప్రకారం వీరి ప్రొబేషనరీ కాలం గత 2022 ఏప్రిల్ నాటికి పూర్తి అయిందని పేర్కొన్నారు.
అయినా మరొక సంవత్సరం గడువు పెంచినప్పటికీ ఆ గడువు కూడా 11 ఏప్రిల్ 2023 తో పూర్తయిందని తెలిపారు. ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు.