- రైతుల ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు
- రైతు పయ్యావుల రాములు ఆత్మహత్యకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలి
- రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
- సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్
విధాత: కామారెడ్డి మున్సిపాలిటీకి రూపొందించిన కొత్తమాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న కామారెడ్డి ప్రాంతానికి చెందిన అడ్లూరు, ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలకు, రైతులకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని లేఖలో తెలిపారు. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని, మాస్టార్ ప్లాన్ లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రేవంత్ తెలిపారు. ఈ విషయంలో మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా అధికారులు రైతుల అభిప్రాయం సేకరించకుండా ఎలా అమలు చేస్తారని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు నెల రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం రైతులపై కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు నిదర్శనమన్నారు.
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్తో చర్చించేందుకు వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజలపై ఈ పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్ట అని రేవంత్ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి ప్రజా సభ లలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.