Congress
- స్పష్టమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్.. బీజేపీకి షాకిచ్చిన ఓటర్లు
- కింగ్ మేకర్ కావలనుకున్న జేడీఎస్కు పట్టున్న పాత మైసూర్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ వైపే ప్రజలు
విధాత: కర్ణాటకలో రాజకీయ ఆనవాయితీ పునరావృతం కాలేదు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి, కింగ్ లేదా కింగ్మేకర్ కావాలనుకున్న జేడీఎస్ నేతల ఆలోచనలకు భిన్నంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. కన్నడ నాట ఫలితాలు ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి.
అందుకే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజారిటీ కట్టబోతున్నారనే మెజారిటీ ప్రీపోల్, ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు కనబపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా కాంగ్రెస్ దూసుకుపోతున్నది. మెజారిటీ మార్క్ను దాటి 120 సీట్లు కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మధ్యాహ్నం తర్వాత తుది ఫలితాలపై స్పష్టత రావచ్చు.
భావోద్వేగాలు బీజేపీని నిలబెట్టలె
దక్షిణాది రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్నిఇచ్చిన కర్ణాటకలో చరిత్ర తిరగయాలని భావించిన ప్రధాని 18 భారీ బహిరంగసభలు, 6 రోడ్ షోలు, కన్నడ ప్రజల కల నెరవేరుస్తాను బహిరంగలేఖ అన్నీ విఫలమయ్యాయి. గుజరాత్ వలె ఇక్కడ కూడా 72 మంది కొత్త అభ్యర్థులను నిలబెట్టి అంతా తానే అన్నట్టు ప్రచారం చేసిన మోడీ మానియా పనిచేయలేదు.
ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు. తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ప్రగతిని చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని ఒకటి రెండు హామీలను మతానికి ముడిపెట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు సంపాదించాలనుకున్న బజరంగ్దళ్ నినాదం బీజేపీని నిలబెట్టలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.అందుకే కమలం పార్టీని కాదని కన్నడ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు.
అంతేకాదు జేడీఎస్ను కుటుంబపార్టీగా ప్రచారం చేసి ఫలితాలు వెలువడుతున్న సమయంలో హంగ్ వస్తే ఆ పార్టీతోనూ జత కట్టడానికి కమలనాథులు ప్రయత్నిస్తారని జాతీయమీడియాలో బహిరంగంగానే వ్యాఖ్యలు వెలువడ్డాయి. దీన్నిబట్టి ఆ పార్టీకి ఒక విధానం అంటూ ఏదీ ఉండదని, అధికారం కోసం ఏమైనా చేస్తుందని తేలింది. అందుకే ఈసారి ఆ అవకాశం కర్ణాటక ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు.
బీఆర్ఎస్, బీజేపీకి షాకే!
కర్ణాటకలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంట రేపుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు ఈ ఫలితాలు మింగుడుపడవు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మరో విషయం ఏమిటి అంటే తమ వెంట నడిచి వస్తుంది అనుకున్న జేడీఎస్కు పట్టున్న పాత మైసూర్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
ఈ ఎన్నికల్లో గెలుపోటముల ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, పార్టీ ఫిరాయింపుల వంటి అంశాలను ప్రజలు నిరసిస్తున్నారని కర్ణాటక ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి కర్ణాటక ఫలితాలు ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాలే. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని అనుకుంటున్న బీజేపీకి షాకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.