Kantara Movie | మరో భారతీయ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును సాధించగా.. ఇటీవల విడుదలై అందరి మన్ననలు అందుకున్న సినిమాను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించనున్నారు. ఆ చిత్రమే కాంతార. ఎలాంటి అంచనా లేకుండా వచ్చిన కన్నడ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్నది. రూ.16కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ.400కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కన్నడ, తెలుగు, హిందీలోనూ హిట్ టాక్ను సొంతం చేసుకున్నది.
రిషబ్ శెట్టి, కిశోర్కుమార్, అచ్చుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. రిషబ్ శెట్టి సినిమాకు దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ చిత్రం ప్రీక్వెల్ను నిర్మించనుండగా.. జూన్లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఇదిలా ఉండగా.. కన్నడ సినిమా అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఏకంగా ఐక్యరాజ్య సమితిలో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. స్విట్జర్లాండ్ జెనీవాలోని యూరప్ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కాంతార సినిమా ప్రదర్శించబోతున్నారు. దివంగత ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ జయంతి రోజున కన్నడ సినిమా యూఎన్లో ప్రదర్శితంకానుండడం మరో విశేషం. ఇందుకోసం రిషబ్ శెట్టి జెనీవాకు చేరుకున్నారు.
ఐరాస పాథె బలెక్సెర్ట్ హాల్ నంబర్-13లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనుండగా.. ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమవుతున్న తొలి కన్నడ సినిమాకాగా కాంతార నిలువనున్నది. అడవులు, పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవించే గిరిజనులు, ఆదివాసీల సమస్యలపై ఐరాసలో రిషబ్ శెట్టి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ యూనివర్సెల్ సబ్జెక్ట్ కావడంతో ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు చిత్రాన్ని అధికారికంగా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సభ్యులందరూ దీనికి హాజరవనుండగా.. వారితో కలిసి రిషబ్ శెట్టి చిత్రాన్ని తిలకించనున్నారు.