ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములై విస్తృత ప్రచారం చేయాలి మొదటి విడత 50 లక్షల కళ్లద్దాలు పంపిణీ ఇప్పుడు 60 లక్షలు అందుబాటులో ఉన్నాయి అవగాహన సదస్సులో దిశా నిర్దేశం చేసిన మంత్రి విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం పై […]

- ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములై విస్తృత ప్రచారం చేయాలి
- మొదటి విడత 50 లక్షల కళ్లద్దాలు పంపిణీ
- ఇప్పుడు 60 లక్షలు అందుబాటులో ఉన్నాయి
- అవగాహన సదస్సులో దిశా నిర్దేశం చేసిన మంత్రి
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్ళు కనబడకుండా ఎవరు ఉండకూడదని ప్రజల కంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఈనెల 18 నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ ఐ స్క్రీనింగ్ మన రాష్ట్రంలో జరుగుతుందన్నారు. ప్రతి కంటి వెలుగు బృందంలో ఒక మెడికల్ అధికారి, ఒక అప్తామలజిస్ట్, ఇద్దరు ఏ ఎన్ ఎం లు, ముగ్గురు ఆశాలు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, వారికి కారు అవసరమైన కంటి పరీక్ష యంత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు.
వైద్య బృందానికి రోజుకు 1500 రూపాయల చొప్పున భోజనం వసతి సౌకర్యం కోసం అందించనున్నామన్నారు. బృందం సభ్యులు స్థానికంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రతిరోజు క్యాంపు కు వెయ్యి రూపాయల చొప్పున పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12లోగా కౌన్సిల్, మండల పరిషత్ సమావేశాలు పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల కళ్లద్దాలు అవసరమని తెప్పించామన్నారు.
ఈనెల 18న ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించగానే, ఆయా నియోజకవర్గాలలో శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించాలన్నారు. కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని, శని ఆదివారాలు, పండగ రోజులలో క్యాంపులు ఉండవని తెలిపారు.
ఈనెల 18 నుండి జూన్ నెలాఖరులోగా అందరికీ పరీక్ష చేయాలన్నారు. కంటి వెలుగు క్యాంపు ల పై విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు ప్రజాప్రతినిధులు అన్ని క్యాంపులలో పాల్గొనాలని సూచించారు. ప్రతి క్యాంపులో పేషెంట్స్ డాక్టర్స్ సమయానికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిదులదన్నారు.
జిల్లాలోని అన్ని టీములను సరిగ్గా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో 69 టీమ్లతోపాటు మూడు టీం లను స్పేర్ లో పెట్టామని మంత్రి తెలిపారు. శిబిరంలో పరీక్ష చేయడంతో పాటు కళ్లద్దాలు అవసరమైన వారికి మందులు కూడా ఇస్తున్నామన్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో ఆయా సర్పంచ్లు కంటి వెలుగు క్యాంపులకు సంబంధించి ముందస్తుగా గ్రామపంచాయతీ కార్యాలయం, రేషన్ షాప్ వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా టామ్ టామ్ ద్వారా, మైక్ లో అనౌన్స్మెంట్ చేయాలని మంత్రి సూచించారు.
ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, సర్పంచులకు సమావేశం నిర్వహించాలన్నారు. ప్రజలకు కళ్లదానంపై కూడా అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధుల అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. కంటి వెలుగు క్యాంపులో ఇవ్వనున్న కళ్ళజోడును మంత్రి ఆయా ప్రజా ప్రతినిధులు ప్రదర్శించారు.
అంతకుముందు కంటి వెలుగు జిల్లా స్థాయి, నియోజకవర్గస్థాయి క్యాంపుల షె డ్యు ల్ ను మంత్రి విడుదల చేశారు. అదేవిధంగా క్యాంపుల వేదికలకు సంబంధించిన బ్యానర్లను మంత్రి ఆవిష్కరించారు.
అవగాహన సదస్సులో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబీ పాటిల్, శాసనమండలి సభ్యులు, జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ ఎంఐసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నరహరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి, వైద్యులు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
