Karnataka CM |
- కర్ణాటక డిప్యూటీ సీఎంగా అంగీకరించిన డీకేఎస్
- 20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు
విధాత: కర్ణాటకలో సీఎం సీటు పంచాయితీ (Karnataka CM Race) కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుజ్జగించడంతో డీకే శివకుమార్ మెత్త పడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు డీకేఎస్ అంగీకరించారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న కర్ణాటక సీఎం కుర్చీ కథ సుఖాంతమైంది.
సుదీర్ఘ చర్చల తర్వాత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జోక్యంతో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డీకే శివకుమార్ బుధవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి పదవినీ స్వీకరించడానికి అయిష్టంగానే అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యను, డిప్యూటీ సీఎంగా శివకుమార్ను కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపికచేశారు. ఈ నెల 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోనియా జోక్యంతో తెగిన పంచాయితీ
ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ బరిలో నిలిచారు. మూడు రోజుల చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎం పదవికి ఎంపికచేసినట్టు వార్తలు వెలువడ్డాయి. డిప్యూటీగా శివకుమార్ను నిర్ణయించినట్టు బుధవారం మధ్యాహ్నం వరకు వార్తలు వచ్చాయి.
బుధవారం రాత్రి ఒక్కసారిగా ప్రతిష్ఠంభన నెలకొన్నది. సీఎం డిమాండ్పై శివకుమార్ దృఢంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే అంశం ఇంకా తేలలేదని లేట్నైట్ వరకు అందిన సమాచారం. సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు శివకుమార్తో ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.
మా అన్న సీఎం కాలేకపోయారు..
శివకుమార్ త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, డీకేఎస్ తమను సంతోషపెట్టలేదని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ అన్నారు. ” కర్ణాటక, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నా. మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ కాలేకపోయారు. ఈ నిర్ణయంతో మేము సంతోషంగా లేము” అని చెప్పారు