- సమన్వయంతో ముందుకు వెళ్ళాలి
- జనగామ జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఇన్చార్జి ఎమ్మెల్సీ కోటిరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపులు లేకుండా పనిచేయాలని టిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ కోటిరెడ్డి శ్రేణులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు యాదగిరి రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. త్వరలో నిర్వహించనున్న గ్రామ స్థాయి ఆత్మీయ సమావేశాల పై జిల్లా పార్టీ ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. దేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా తెలంగాణను మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను పకడ్బందీగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ రాజయ్య ప్రసంగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి కృష్ణారెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు రమణారెడ్డి, ఎంపిపిల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, మాజీ కొమురవేల్లి చైర్మన్ సంపత్, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.