విధాత: సుదీర్ఘ పాదయాత్రకు లోకేశ్ సిద్ధమయ్యారు.. 400 రోజుల్లో 125 నియోజకవర్గాలు చుట్టేస్తూ 4000 కిలోమీటర్ల యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. శుక్రవారం కుప్పం నుంచి తొలి అడుగు పడనుంది. అయితే ఈలోపే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా లోకేష్ మీద డిజిటల్ దాడి ప్రారంభించింది. ఆయన నడవలేరని.. ఇదంతా వృథా ప్రయాస అంటూ పోస్టులు పెడుతున్నారు.
యాత్రకు జనంలో వచ్చిన స్పందన చూశాక కదా కామెంట్స్ చెయ్యాలి.. కానీ ఇక్కడ మాత్రం తొలి అడుగు పడకముందే వైసిపి ఉలికిపడుతోంది. తొలి రోజు నుంచీ ఆయన్ను బదనాం చేయడమే లక్ష్యంగా వైసిపి పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక టీడీపీలో కూడా పెద్దగా జోష్ లేదని అంటున్నారు. భావి నాయకుడు.. మున్ముందు పార్టీని నడుపుతారని ఆశిస్తున్న లోకేష్ యాత్ర పట్ల పార్టీ క్యాడర్లోనూ అంత హుషారు లేదని అంటున్నారు.
ఆయన సమర్థత మీద.. వాక్చాతుర్యంపైన రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన వంటి అంశాల్లో ఆయన పరిణితి అంత గొప్పగా లేదన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ క్యాడర్.. ఆ ఇప్పుడీయన ఉద్ధరించి చచ్చేదేం లేదన్నట్లుగా మన్ను తిన్న పాముల్లా మిన్నకుంటున్నారని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటికీ లోకేష్ ఇంకా చంద్రబాబు కొడుకుగానే చలామణి అవుతున్నారు తప్ప సొంత ఇమేజి ఇంకా బిల్డప్ చేసుకోలేదు. దానికితోడు ఆయన మంత్రిగా పని చేసి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఓడిపోయిన అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచయాలు పెంచుకోవడం.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అవగతం చేసుకోవడం.. ఇంకా తమ పార్టీ బలాలు.. బలహీనతలు గుర్తించి వాటిని సరిదిద్దుకునే చర్యలు తీసుకోవడం.. ఇలాంటివన్నిటిపై ఆయన చొరవ తీసుకోవడం ఏనాడూ జరగలేదు.
నేడు లోకేష్ పాదయాత్రలో కూడా మా నాన్నకు ఓటెయ్యండి అని మాత్రమే చెప్పాలి తప్ప నన్ను గెలిపించండి.. సమాజానికి ఇది చేస్తాం.. యువతకు అది చేస్తాం అని చెప్పేందుకు వీలు లేదు.. ఈ మాత్రం భరోసా ఇవ్వలేనపుడు పాదయాత్ర వల్ల ఎవరికి లాభం.. అసలు లోకేశ్ నడిస్తే పార్టీకి వచ్చే లాభం ఏముందని.. క్యాడర్ పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది.