- ఎక్కడ అవినీతి ఉంటే.. అక్కడ దర్యాప్తు సంస్థలు వస్తాయి..
- ఈడీ, సీబీఐ వస్తే కేసీఆర్కి ఎందుకు భయం?
విధాత: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను బెంగాల్, తెలంగాణ సీఎంలు మమతా, కేసీఆర్ పక్కదోవ పట్టిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే విమర్శించారు. సూర్యాపేట బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ లోక్ సభ పరిధిలో బీజేపీ ప్రభుత్వంలో అత్యధిక నిధులు వచ్చాయన్నారు. రాష్రంలో పేదలకు ఇళ్ళు కావాలని ఏకంగా ప్రధానికి అర్జీ పెట్టుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ళు ఇచ్చే క్రమంలో రాష్ట్రం అడ్డుకుంటుందని ఆరోపించారు.
సూర్యాపేట జిల్లా ధాన్యం కొనుగోళ్ళలో 1150 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. అవినీతి చేసిన వారే విచారణ చేస్తే నిజాలు ఎలా బయటపడతాయని ప్రశ్నించారు. తెలంగాణాలో మా ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోళ్ళ అవినీతి మీదే మొదటి విచారణ చేపడతామన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్రం విఫలమైందని, ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. అనేక శాఖల్లో భారీ ఖాళీలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగట్లేదన్నారు. స్థానికంగా కేసీఆర్ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ ఇస్తానన్న ఉద్యోగాల మీద ఎలా మాట్లాడతారని ధ్వజమెత్తారు.
కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగులకు అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలో భారత దేశంలో మాత్రమే మోడీ చలవతో అత్యధిక స్టార్ట్ అప్ కంపెనీలు వచ్చాయన్నారు. మోడీ ఆధ్వర్యంలో అధిక ఉద్యోగాలు వస్తుంటే కేసీఆర్ రాజ్యంలో మాత్రం అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలే కనిపిస్తున్నాయన్నారు.
రాష్ట్రాల, గ్రామాల అభివృద్ధికి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని సర్పంచులు రాజీనామా చేస్తున్నారన్నారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టించడంతోనే తెలంగాణాలో అభివృద్ధి దూరమౌతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికే మా పర్యటన ఉద్దేశమన్నారు.
బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుండడం వల్లే 3 రాష్ట్రాల నుండి నేడు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్నారు. కేంద్ర విచారణ సంస్థలతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారన్న అంశం పై స్పందిస్తూ ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ విచారణ సంస్థలు వాటి పని చేసుకుంటూ పోతాయన్నారు.
బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుంది , ఎక్కడా విచారణ సంస్థలను దుర్వినియోగం చేయడంలేదన్నారు.ఎక్కడైతే అవినీతి రాజ్యమేలుతుందో అక్కడికి విచారణ సంస్థలు వస్తాయన్నారు. కొన్ని ప్రభుత్వాలు వారి కోసం, వారి పరివారం, వారి స్వార్థాల కోసం అవినీతికి పాల్పడుతున్నాయన్నారు.
ఈడీ , సీబీఐ వస్తే కేసీఆర్ కి ఎందుకు భయమన్నారు. విచారణ సంస్థలు పేరు వింటే కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదులుతుందన్నారు. బీజేపీ పార్టీ వస్తే తన అవినీతి బయటపడుతుందని కేసీఆర్కి భయం వేస్తోందన్నారు. సీబీఐని దుర్వినియోగం చేస్తున్నామనడం నిరాధారమన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు సిట్ నుంచి సీబీఐకి కోర్టు బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమి లేదన్నారు. సీబీఐ అయితే పారదర్శక విచారణ జరిగే అవకాశం ఉన్నందునే సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బదిలీ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ పరిశ్రమ ఇద్దామన్నా కేసీఆర్ ప్రభుత్వం భూములివ్వడం లేదన్నారు. అయినా పలు రంగాల్లో కేంద్రం భారీ నిధులు వెచ్చించిందన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సానుకూల నిర్ణయం వస్తుందని అన్నారు.