సొంత ఫోన్లను ధ్వంసం చేశారు కోర్టుకు వెల్లడించిన ఈడీ అధికారులు ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ (Delhi Liquor scam) రూపొందిస్తున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం మొదలైందని, దీనికి ముఖ్య సూత్రధారి ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియానే అని ఈడీ పేర్కొన్నది. శుక్రవారం సిసోడియాను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. విధాత : ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) వాడిన సిమ్‌కార్డులు (Sim Cards)అన్నీ ఇతరుల పేర్లమీద కొనుగోలు చేసినవేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement […]

  • సొంత ఫోన్లను ధ్వంసం చేశారు
  • కోర్టుకు వెల్లడించిన ఈడీ అధికారులు

ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ (Delhi Liquor scam) రూపొందిస్తున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం మొదలైందని, దీనికి ముఖ్య సూత్రధారి ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియానే అని ఈడీ పేర్కొన్నది. శుక్రవారం సిసోడియాను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.

విధాత : ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) వాడిన సిమ్‌కార్డులు (Sim Cards)అన్నీ ఇతరుల పేర్లమీద కొనుగోలు చేసినవేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate) ఆరోపించింది. వేరే వ్యక్తుల పేర్ల మీద ఫ్లిప్‌కార్ట్‌ (Flipkar) ద్వారా మొబైల్‌ ఫోన్లను సిసోడియా కొనుగోలు చేశారని, వాటికి చెల్లింపులు కూడా ఆయన చేయలేదని తెలిపింది. ఆయన తన సొంత ఫోన్లను ధ్వంసం చేశారని పేర్కొన్నది.

ఇది దాదాపు 292 కోట్ల రూపాయలకు సంబంధించిన నేరమని, అసలు ఏం జరిగిందనేది (Modus Operandi) బయటపెట్టేందుకు ఇప్పటికే సమన్లు జారీ చేసిన అందరినీ విచారించాల్సి ఉన్నదని తెలిపింది.

ఇప్పటికే తాము ఈ కేసులో విచారించినవారు ఇచ్చిన స్టేట్‌మెంట్లకు సిసోడియా స్టేట్‌మెంట్‌ పూర్తి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నది.

మద్యం పాలసీ వెనుక కుట్రను విజయ్‌నాయర్‌, ఇతర ‘సౌత్‌’ గ్రూప్‌ (South Group) సమన్వయం చేశారని చెప్పారు. ఈ కుంభకోణం మొత్తం మొదలైందే మద్యం పాలసీని తయారు చేసే సమయంలోనని, దాన్ని రూపొందించినవారిలో సిసోడియా, ఇతరులు భాగస్వాములుగా ఉన్నారని జోహెబ్‌ కోర్టుకు వివరించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Telangana MLC K Kavitha) తదితరులతో ఉన్న ‘సౌత్‌ గ్రూప్ 9 జోన్లను పొందారని, ఢిల్లీలో మద్యం వ్యాపారంలో (Excise Business in Delhi) వీరు కీలక భాగస్వాములుగా ఉన్నారని ఈడీ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తరఫున సౌత్‌ గ్రూప్‌తో విజయ్‌నాయర్‌ (Vijay Nair) చర్చలు జరిపారని పేర్కొన్నది.

ఇండోస్పిరిట్స్‌ లిక్కర్‌ కంపెనీ (Indospitits Liquor Company) ఫైళ్లను ఎక్సయిజ్‌ శాఖ క్లియర్‌ చేసేలా వ్యక్తిగతంగా కృషి చేసినట్టు విచారణలో వెల్లడైందని ఈడీ పేర్కొన్నది.

కొన్ని ప్రైవేటు కంపెనీలకు హోల్‌సేల్‌ బిజినెస్‌ అప్పగించేందుకు మనీశ్‌ సిసోడియా కుట్ర చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ప్రైవేటు సంస్థలకు 12 శాతం హోల్‌సేల్‌ లాభాన్ని నిర్ణయించే క్రమంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుపలేదని ఈడీ తరఫున వాదించిన జోహెబ్‌ హుస్సేన్‌ ఆరోపించారు. కొంతమంది వ్యక్తులకు అక్రమంగా లబ్ధి చేకూర్చేలా మద్యం పాలసీని రూపొందించడంలో కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు సిసోడియాను పది రోజులపాటు కస్టడీ (Custody)కి ఇవ్వాలని కోర్టును కోరారు.

అయితే.. సిసోడియాను పదిరోజుల పాటు కస్టడీకి కోరుతూ ఈడీ చేసిన వాదనలను ఆయన తరఫు న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ (Dayan Krishnan) వ్యతిరేకించారు. సిసోడియా, ఇతరులు తయారు చేసిన మద్యం పాలసీని అప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని వాదించారు. అసలు ఈ కేసులో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్న దయాన్‌కృష్ణన్‌.. మరి ఆ సొమ్మంతా ఏదని అడిగారు. ఎందుకు రికవరీ చేయలేకపోయారని ప్రశ్నించారు.

Updated On 10 March 2023 11:05 AM GMT
Somu

Somu

Next Story