విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖలోనే ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు బలహీనవర్గాల గృహ నిర్మాణాన్ని ఇతర శాఖలు చేపడుతున్నందున ఈ శాఖను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాఖలోని గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేసింది. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలనా శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
మంత్రి వేముల సమీక్ష
రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.
ప్రస్తుత కేటాయింపులు, వ్యయం, 2023-24 ప్రతిపాదనలపై సమీక్ష చేశారు. మార్పులు చేర్పులతో ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.